విద్యారుణాలపై బ్యాంకులకు వెసులుబాటు
న్యూఢిల్లీ: విద్యా రుణాల విషయంలో బ్యాంకులను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ నిబంధనలను సడలించింది. నిరుద్యోగం కారణంగా రుణ చెల్లింపు వ్యవధిని రీషెడ్యూల్ చేసినప్పుడు బ్యాంకులు ఆయా రుణాలను మొండిబకాయిల లెక్కింపులోభాగంగా పునర్వ్యవస్థీకరించిన ఖతాలుగా పరిగణినించవద్దని స్పష్టం చేసింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కు రాసిన లేఖలో ఆర్బీఐ ఈ అంశాన్ని పేర్కొంది. ‘నిరుద్యోగం/తక్కువ వేతనం లభించే ఉద్యోగాల కారణంగా మొత్తం రుణ కాలంలో బ్యాంకులు మూడుసార్లు రుణ చెల్లింపునకు విరామం(మారటోరియం) ఇవ్వొచ్చు(ఒక్కోసారికి 6 నెలలు మించకుండా).
దీన్ని రుణ పునర్వ్యవస్థీకరణగా చూడొద్దు’ అని వెల్లడించింది. అయితే, ఈ అదనపు మారటోరియం వ్యవధిలో, దీనికి ఏడాది కాలం తర్వాత ఆయా రుణాలపై 5 శాతం అధిక కేటాయింపు(ప్రొవిజనింగ్) చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. రుణాల తిరిగి చెల్లింపు వ్యవధిని పొడిగించినప్పుడు వీటిని పునర్వ్యవస్థీకరించిన రుణాలుగా పరిగణించాల్సి ఉంటుందా అనేదానిపై స్పష్టతనివ్వాల్సిందిగా ఐబీఏ కోరడంతో ఆర్బీఐ ఈ వివరణ ఇచ్చింది. కాగా, ప్రస్తుతం ఉన్న రుణగ్రహీతలకు కూడా ఈ రీపేమెంట్ గడవు పొడిగింపు, మారటోరియంల సంఖ్య పెంపును అమలు చేయొచ్చని(స్టాండర్డ్ రుణ ఖాతాలకు మాత్రమే) కూడా ఆర్బీఐ తెలిపింది.