హైదరాబాద్ చేరుకున్న ‘రామ్చరణ్’ తొలి విమానం
- 78 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఏటీఆర్ 72-500
- జూన్ చివరి వారంలో ఎగరనున్న తొలి ఫ్లైట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాలీవుడ్ నటుడు రామ్చరణ్ తేజ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ‘ట్రూ జెట్’ తొలి విమానం హైదరాబాద్కు చేరుకుంది. ఏటీఆర్ 72-500 విమానం శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుందని, రెండో విమానం మరో వారం రోజుల్లో చేరుకుంటుందని టర్బో మెఘా ఎయిర్వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. విమానాలు ఎగరడానికి సంబంధించి డీజీసీఏ నుంచి మరో ఇరవై రోజుల్లో తుది అనుమతులు అందుతాయని అంచనా వేస్తున్నామని, జూన్ చివరి వారంలో విమాన సర్వీసులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.
తొలుత తిరుపతి, ఔరంగాబాద్, రాజమండ్రిలకు సర్వీసులను నడపనున్నారు. రామ్చరణ్ డెరైక్టర్గా ఉన్న టర్బో మెఘా ఎయిర్వేస్ ‘ట్రూజెట్’ పేరుతో హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. ట్రూజెట్ సర్వీసులకు రామ్చరణ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.