ఫార్మా దిగ్గజం లుపిన్ ఫౌండర్ కన్నుమూత
ఫార్మా దిగ్గజం లుపిన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ దేశ్ బంధు గుప్తా కన్నుమూశారు. ఉదయం పూట తమ తండ్రి మరణించినట్టు లుపిన్ సీఈవో వినీత్ గుప్తా, ఎండీ నైలేశ్ గుప్తాలు తెలిపారు. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సు, రాజస్తాన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించిన గుప్తా, 1968లో లుపిన్ ను ప్రారంభించారు. కేవలం 5వేల రూపాయల స్టార్టప్-అప్ క్యాపిటల్ తో ప్రారంభించిన ఈ సంస్థను, 1.83 బిలియన్ డాలర్లకు తీసుకొచ్చారు. ప్రస్తుతం 100కి పైగా దేశాల్లో లుపిన్ తన కార్యకలాపాలు సాగిస్తోంది.
ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడటానికి సరసమైన ధరల్లో మంచి నాణ్యత కలిగిన మెడిసిన్లను అందించడమే లక్ష్యంగా గుప్తా ఈ సంస్థను ప్రారంభించారు. ఈయన నేతృత్వంలోనే కంపెనీ దేశీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎగిసింది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఫార్మా కంపెనీగా పేరుంది. 1988 అక్టోబర్ లో గుప్తా లుపిన్ హ్యుమన్ వెల్ఫేర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ను కూడా స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధిని సాధిస్తూ పేదరికాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా ఈ ఫౌండేషన్ కృషిచేస్తోంది.