పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు
పెట్రోలు, డీజిల్ ధరలను చమురు సంస్థలు తగ్గించాయి. లీటరు పెట్రోలుపై 2.41 రూపాయల చొప్పున, లీటరు డీజిల్పై 2.25 రూపాయల చొప్పున తగ్గింపు ప్రకటించాయి. గత రెండు నెలల్లో ఆరు సార్లు పెట్రో ధరలు తగ్గాయి. తాజాగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలను శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలు చేస్తారు.
ఆగస్టు ఒకటో తేదీ నాటికి లీటరు పెట్రోలు ధర రూ. 79.01 ఉండగా, తాజా తగ్గింపుతో అది 72 రూపాయలకు చేరుకోనుంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు.. చమురు ధరలపై నియంత్రణను ప్రభుత్వం ఎత్తేయడంతో ఈ తగ్గింపు సాధ్యమైనట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో బ్యారల్ ముడిచమురు ధర 120 నుంచి 130 డాలర్ల వరకు చేరుకుంది. ఆ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బాగా పెరిగాయి. తర్వాత ఇప్పుడు అది గణనీయంగా తగ్గడంతో పెట్రోలు, డీజిల్ ధరలు కాస్త నేలకు దిగుతున్నాయి.