పన్ను చెల్లింపుదారులకు మరింత మర్యాద

పన్ను చెల్లింపుదారులకు మరింత మర్యాద - Sakshi


న్యూఢిల్లీ: పన్ను చెలింపుదారులతో మరింత అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా ఐటీ శాఖ అధికారులు పన్ను చెల్లింపుదారులు/అసెస్సీలతో భేటీ సందర్భంగా వారిని అనవసరంగా వేచిచూసేలా చేయొద్దని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అసెస్సీలందరికీ ఒకేసారి సమయం ఇవ్వడం, వారిని గంటలతరబడి వెయిటింగ్ చేయిండం వంటివి లేకుండా చేయడమే ఈ చర్యల ఉద్దేశమని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.



చెలింపుదారుల ఫిర్యాదుల వినడం లేదంటే రిటర్నుల పరిశీలన ఏదైనా సరే ముందుగానే సమయాన్ని నిర్ధేశించాలని.. అదేవిధంగా భేటీల మధ్య తగిన వ్యవధి ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో సుమారు 3.7 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. అయితే, కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఇందులో 1% పన్ను రిటర్నులను(అంటే సుమారు 3-3.5 లక్షల మంది పన్ను చెల్లింపుదారులవి) మాత్రమే తనిఖీ చేస్తున్నట్లు అంచనా. ప్రత్యక్ష పన్నుల రూపేణా ఈ ఏడాది ప్రభుత్వం రూ.7.36 లక్షల కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది ఈ వసూళ్లు రూ.6.36 లక్షల కోట్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top