కొత్త కంపెనీల చట్టం.. మంచి కాలక్షేప పుస్తకం
సెబీ మాజీ చైర్మన్ ఎం. దామోదరన్
న్యూఢిల్లీ: కొత్త కంపెనీల చట్టాన్ని మంచి కాలక్షేప పుస్తకంగా అభివర్ణించారు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్. తనకు సరదాగా జోక్స్ చదవాలనిపించినప్పుడల్లా దీన్ని చదువుకుంటూ ఉంటానన్నారు. పరిధిపరంగా చూసినా, కంటెంట్పరంగా చూసినా కంపెనీల చట్టం ఇటీవలి కాలంలో తాను చదివిన చాలా మటుకు ఫిక్షన్ పుస్తకాలను మించి కాలక్షేపం ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
కంపెనీల బోర్డుల పనితీరు మదింపు ప్రక్రియ అంశంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సెమినార్లో పాల్గొన్న సందర్భంగా దామోదరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కంపెనీ బోర్డు పనితీరు మదింపు అనేది తూతూ మంత్రంగా జరిపే ప్రక్రియగా కాకుండా విధివిధానాలకు తగ్గట్లుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు, డెరైక్టర్ల పనితీరును మదింపు ప్రక్రియకు సంబంధించి మైండ్సెట్ మారాలని సెబీ హోల్టైమ్ సభ్యుడు ప్రశాంత్ శరణ్ సూచించారు.
ఇది ఒకరిని పొగిడేందుకు, మరొకరిని తెగిడేందుకు ఉద్దేశించినది కాదన్నారు. నిబంధనలు పాటిం చేందుకు మాత్రమే స్వతంత్ర డెరైక్టర్లను నియమించుకోవడం కాదని, వారి సేవలను కంపెనీ శ్రేయస్సు కోసం సమర్థంగా వినియోగించుకోవాలన్నారు.