దీంతో రిలయన్స్ కిట్టీకి బంపర్ బొనాంజానే
ముంబై : రిలయన్స్ జియో మూడు రోజుల కిందటే అత్యంత చౌకైన 4జీ హ్యాండ్సెట్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. సంచలనాలు సృష్టిస్తూ వస్తున్న ఈ ఫోన్తో రిలయన్స్ కిట్టీలోకి భారీగా కస్టమర్లు వచ్చి చేరనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు మరో 10 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లు యాడ్ కానున్నారని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అంతేకాక రిలయన్స్ జియో మార్కెట్ షేరు కూడా 2018 నాటికి మరో 10 శాతం మేర పెరుగనుందని పేర్కొన్నాయి. పడిపోతున్న ఇండస్ట్రి రెవెన్యూ ట్రెండ్ను ఇది తిరిగి పుంజుకునేలా చేస్తుందని తెలిపాయి.
''సెప్టెంబర్ నుంచి రిలయన్స్ జియో ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫోన్తో ఇంటర్నెట్ వాడకం పైకి ఎగుస్తోంది. రెవెన్యూ విషయంలో టెల్కోలు ఇటీవల ఎదుర్కొంటున్న ట్రెండ్ను ఇది రివర్స్ చేస్తోంది'' అని ఫిచ్ సోమవారం పేర్కొంది. ఒకవేళ కనీసం 100 మిలియన్ సబ్స్క్రైబర్లు జియోఫోన్కు వచ్చి చేరితే, ఈ చౌక హ్యాండ్సెట్తో వార్షిక ఇండస్ట్రీ రెవెన్యూలు అదనంగా 3-4 శాతం పెరుగుతాయని తెలిపింది.
గతవారంలో నిర్వహించిన షేర్హోల్డర్స్ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఫోన్ ప్రవేశపెట్టారు. జీరోకే జియో ఫోన్ అందించనున్నట్టు తెలిపారు. అయితే తొలుత కస్టమర్లు రూ.1500 కట్టి ఈ ఫోన్ను కొనుక్కోవాలి, అనంతరం వీటిని కంపెనీ మూడేళ్ల తర్వాత రీఫండ్చేయనుంది. ఈ స్కీమ్ మొదటిసారి 4జీని వాడే యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుందని, రెవెన్యూ మార్కెట్ షేరును పొందడంతో జియోకు ఎంతో సాయపడుతుందని ఫిచ్ నివేదించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 2జీ హ్యాండ్సెట్లను ఇది చాలా త్వరగా రీప్లేస్ చేస్తుందని పేర్కొంది. జియో ఒకవేళ మరిన్ని ఆఫర్లను ప్రకటిస్తే, వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ తిరుగులేని సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంటుందని ఫిచ్ చెప్పింది. ఇతర కంపెనీలు కూడా ధరలు తగ్గింపు, డిస్కౌంట్లు, ప్రమోషన్లు చేపడతారని ఫిచ్ తెలిపింది. ఎక్కువ ధరలతో ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం తక్కువగా ఉంది. దీంతో ఏడాది ఏడాదికి ఇండస్ట్రీ రెవెన్యూలు 15.6 శాతం పడిపోతున్నాయని ఫిచ్ తన నివేదికలో వెల్లడించింది.
సంబంధిత వార్తలు