ఖాతాలు ఆధార్కు అనుసంధానం!
⇒ బ్యాంకర్లకు ప్రధాని మోదీ ఈ-మెయిల్
⇒ ఆర్థికాంశాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచన
న్యూఢిల్లీ: జన్ధన్ బ్యాంక్ అకౌంట్లు అన్నింటినీ ఆధార్కు అనుసంధానించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్యాంకులకు సూచించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వినియోగదారులకు రుణం, బీమా, పెన్షన్ల వంటి ప్రయోజనాలను అందించడానికి సంబంధించి రెండవ దశ జన్ధన్ యోజన అమల్లో ‘అకౌంట్ల ఆధార్ అనుసంధాన ప్రక్రియ’ ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.
దీనితోపాటు ఆర్థిక అంశాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి మరిన్ని చర్యలు అవసరమని కూడా అన్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా బ్యాంకర్లకు ఈ మెయిల్ పంపారు. ప్రధానంగా జన్ధన్ యోజన మొదటిదశ విజయవంతానికి జరిగిన కృషి పట్ల బ్యాంకర్లను ఈ లేఖలో అభినందించారు. బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండడం ద్వారా దాదాపు 99.74 శాతం గృహాలు దేశ ఆర్థిక వ్యవస్థలో అనుసంధానమైన విషయం ఒక గొప్ప ముందడుగని అన్నారు.
అపార ప్రయోజనాలు...
పలు పథకాల ప్రయోజనాలు పక్కదారి పట్టకుండా ఇకపై ప్రజలకు నేరుగా అందడానికి (డీబీటీ) జన్ధన్ యోజన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో బ్యాంకింగ్ కృషి అపూర్వమని అభివర్ణించారు. మరోవైపు ఆధార్ ప్రయోజనాలు మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. జన్ధన్ యోజనను విజయవంతం చేసిన విధంగానే అకౌంట్లను ఆధార్కు అనుసంధానించే ప్రక్రియను కూడా బ్యాంకులు విజయవంతంగా నిర్వహిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.