యాపిల్ కు ఓ గుడ్, బ్యాడ్ న్యూస్...
న్యూఢిల్లీ : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను సొంతం చేసుకోవాలనుకుంటున్న యాపిల్ ప్లాన్స్ కు ఓ గుడ్ , బ్యాడ్ న్యూస్. యాపిల్ రీఫర్ బిష్డ్ ఫోన్లను (వినియోగ ఫోన్లు) దిగుమతి చేసుకుని విక్రయాలకు అనుమతించబోమని ప్రభుత్వం చెబుతూనే.. బ్రాండెడ్ రిటైల్ స్టోర్లు తెరుచుకోవడానికి స్థానికంగా ఉన్న నిబంధనల్లో కొంత ఉపశమనం ఇవ్వనున్నామని తెలిపింది. వినియోగ ఫోన్లను భారత్ లో అమ్మకానికి అనుమతి ఇవ్వబోమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే భారత్ లో తెరుచుకోబోయే రిటైల్ స్టోర్లకు నిబంధనల్లో కొంత మాఫీని కల్పిస్తామని చెప్పారు.
సింగల్ బ్రాండ్ రిటైల్ లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ అనుమతి కల్పించింది. కానీ మూడింట ఒక వంతు కాంపోనెంట్స్ భారత్ కు చెందినవే ఉండాలనే నిబందన కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వం చెప్పింది. స్థానిక ఉద్యోగవకాశాలను, పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఈ నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. యాపిల్ కు ఇటీవలే భారత్ లో రిటైల్ స్టోర్లు ఏర్పాటుచేసుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నుంచి అనుమతులు లభించాయి. యాపిల్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ ఇటీవలే భారత్ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలు ప్రభుత్వ సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఐఓఎస్ యాప్ డెవలప్ మెంట్ సెంటర్ ను బెంగళూరులో ప్రారంభించబోతున్నట్టు కుక్ ఈ పర్యటనలో ప్రకటించారు.
మరిన్ని వార్తలు