భారత్‌లో ఇన్‌ఫ్రా అభివృద్ధికి ప్రపంచబ్యాంక్ సహకారం

భారత్‌లో ఇన్‌ఫ్రా అభివృద్ధికి ప్రపంచబ్యాంక్ సహకారం


న్యూఢిల్లీ: భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇందులోభాగంగా వచ్చే ఐదేళ్లలో బాండ్‌ల జారీ ద్వారా(రూపాయి కరెన్సీలో) 2.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ.1,500 కోట్లు)ను సమీకరించనున్నట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ జిన్-యాంగ్ కయ్ వెల్లడించారు.



 ప్రైవేటు రంగానికి రుణాలను అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ఐఎఫ్‌సీని నెలకొల్పింది. భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసే కంపెనీలకు నిధుల కల్పన కోసం ఈ మొత్తాన్ని ఐఎఫ్‌సీ వినియోగించనుంది.  కాగా, ఐఎఫ్‌సీ చేపట్టనున్న ఈ బాండ్‌ల ఇష్యూ భారత్‌లో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అదేవిధంగా దీర్ఘకాలిక బాండ్ మార్కెట్ అభివృద్ధికి  కొత్త ఉత్తేజం తీసుకురానుందని ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్  వ్యాఖ్యానించారు. ఇతర సంస్థలు కూడా ఈ మార్గాన్ని అనుసరించేందుకు వీలవుతుందన్నారు. భారత్, ఐఎఫ్‌సీల మధ్య ఈ బాండ్‌ల జారీ ప్రోగ్రామ్ మరో కీలక మైలురాయిగా నిలవనుందని మాయారామ్ అభిప్రాయపడ్డారు.



మౌలిక రంగానికి నిధులందించేందుకు వీలుగా బ్యాంకులు దీర్ఘకాలిక బాండ్‌లు చేసేందుకు ఇటీవలే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనుమతించిన విషయాన్ని మాయారామ్ గుర్తు చేశారు. ఈ చర్యల ద్వారా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు వేగం పుంజుకోవడమేకాకుండా.. ప్రైవేటు రంగంలో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, తాము జారీ చేసే బాండ్‌లను విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని కయ్ వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top