హెచ్‌యూఎల్ లాభం రూ. 1,057 కోట్లు


న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 1,057 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,019 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 4% వృద్ధి. ఈ కాలంలో లభించిన రూ. 106 కోట్ల అదనపు ఆదాయం ఇందుకు దోహదపడింది. ఇదే కాలంలో కంపెనీ అమ్మకాలు 13% పుంజుకుని రూ. 7,571 కోట్లకు చేరాయి. గతంలో రూ. 6,687 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి.



మరోసారి పరిశ్రమ వృద్ధిని మించిన పనితీరును చూపినట్లు కంపెనీ చైర్మన్ హరీష్ మన్వని చెప్పారు. ఈ బాటలో అటు అమ్మకాలు, ఇటు లాభాల్లో మంచి పురోగతిని సాధించినట్లు తెలిపారు. అయితే మార్కెట్లు మందగమనంలో ఉన్నాయని, ఇకపై మరింతగా నెమ్మదించే అవకాశముందని కంపెనీ సీఎఫ్‌వో పీబీ బాలాజీ చెప్పారు. ప్రీమియం విభాగంలో చూస్తే కస్టమర్లు చిన్న తరహా ప్యాకెట్లు కొనేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.  



 సబ్బుల అమ్మకాలు ఓకే

 సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకాలు 13% పుంజుకుని రూ. 3,848 కోట్లకు చేరగా, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు దాదాపు 15% పెరిగి రూ. 2,160 కోట్లయ్యాయి. పానీయాల విభాగం నుంచి 10% అధికంగా రూ. 837 కోట్ల ఆదాయం లభించగా, ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల అమ్మకాలు 19% ఎగసి రూ. 544 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు బీఎస్‌ఈలో దాదాపు 4% జంప్‌చేసి రూ. 686 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top