ఎఫ్ఐఐల డిమాండ్లకు తలొగ్గేది లేదు
రూ. 40,000 కోట్ల పన్ను నోటీసులపై ఆర్థిక శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 40,000 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను ఉపసంహరించుకోవాలంటూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గే ప్రసక్తే లేదని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. దీనిపై ఎంత ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గబోమని పేర్కొన్నాయి. 2015 మార్చి 31 దాకా ఆర్జించిన క్యాపిటల్ గెయిన్స్పై 20% కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)ను కట్టాలంటూ ఎఫ్ఐఐలకు రెవెన్యూ శాఖ నోటీసులు పంపడం తెలిసిందే.
మ్యాట్ తమకు వర్తించదంటూ ఎఫ్ఐఐలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్(ఏఏఆర్)ను ఆశ్రయించినప్పటికీ పన్ను శాఖకు అనుకూలంగానే ఉత్తర్వులు వచ్చాయి. దీని మీద అసంతృప్తిగా ఉంటే అత్యున్నత న్యాయస్థానాల్లోనైనా అప్పీలు చేసుకోవచ్చని రెవెన్యూ విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ సైతం వ్యాఖ్యానించారు.