ఉందిలే.. మంచి కాలం!

ఉందిలే.. మంచి కాలం!


మోదీ సర్కారు చెబుతున్న మంచి రోజులు(అచ్ఛే దిన్) వచ్చేస్తున్నాయా? ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఇదే  విషయాన్ని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, సుస్థిర ప్రభుత్వం కొలువుదీరడంతో భవిష్యత్తులో రెండంకెల వృద్ధి దిశగా మనం దూసుకెళ్లనున్నామని పేర్కొంది. ఇక మరిన్ని భారీ సంస్కరణలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చింది.



సబ్సిడీల తగ్గింపు, డిజిన్వెస్ట్‌మెంట్ నిధులను భారీగా సమీకరించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఇన్‌ఫ్రా ఇతరత్రా రంగాల్లో భారీగా వెచ్చించాలని కూడా సూచించింది. నియంత్రణలు, పన్నుల వ్యవస్థను సరళతరం చేయడం ద్వారా దేశంలో వ్యాపారానికి మెరుగైన వాతావరణ్నా కల్పించాలని పేర్కొంది. తద్వారా ప్రైవేటు రంగం కూడా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తమవంతు పాత్ర పోషిస్తుందనేది సర్వే సారాంశం. మొత్తంమీద మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ కలలకు మార్గం సుగమం చేసే దిశగా ఆర్థిక సర్వే తగిన బాటలు వేసింది.


 

సంస్కరణల మోత.. రెండంకెల వృద్ధి..

2014-15 ఆర్థిక సర్వేలో దిశానిర్దేశం...

వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.5 శాతానికి చేరే చాన్స్

భారీస్థాయి కీలక సంస్కరణలకు సరైన సమయం ఇదే...

ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలను భారీగా పెంచాలి...

వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించాలి...

నియంత్రణలు, పన్నుల వ్యవస్థను మరింత సరళం చేయాలి...

అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు,

సుస్థిర ప్రభుత్వంలో భారత్‌కు అద్భుత అవకాశం

సబ్సిడీల తగ్గింపుతో ద్రవ్యలోటుకు కళ్లెమేయాలి...


న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి పూర్థి స్థాయి బడ్జెట్‌ను ప్రతిబింబించేలా 2014-15 ఏడాది ఆర్థిక సర్వే వెలువడింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 8.1-8.5 శాతానికి దూసుకెళ్తుందని సర్వే అంచనా వేసింది. అటు తర్వాత సంవత్సరాల్లో కూడా 8-10 శాతం స్థాయిలో రెండంకెల వృద్ధిని అందుకునేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయని పేర్కొంది.



జీడీపీ గణాంకాల లెక్కింపునకు బేస్ రేటును 2005-06 నుంచి 2011-12కు మార్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.4 శాతానికి(గత అంచనా 6 శాతం) చేరుతుందని ప్రభుత్వం తాజాగా అంచనా వేయడం తెలిసిందే. ‘అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదల ఇతరత్రా సానుకూల పరిణామాలతోపాటు సుస్థిరమైన ప్రభుత్వం కొలువుదీరడం భారత్‌కు చరిత్రాత్మకమైన అవకాశం కల్పిస్తోంది. అత్యంత కీలకమైన భారీ(బిగ్ బ్యాంగ్) సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ఇదే సరైన సమయం. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థను రెండంకెల వృద్ధి దిశగా దూసుకుపోయేలా చేయొచ్చు’ అని సర్వే పేర్కొంది.

 

కఠిన పన్నుల వ్యవస్థకు చెక్...



దేశంలో పన్నుల వ్యవస్థ, యంత్రాంగాన్ని పారదర్శకంగా, మరింత సరళంగా తీర్చిదిద్దాలని.. తద్వారా పన్ను చెల్లింపుదారులకు అత్యంత స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించాలని సర్వే సూచించింది. అవసరమైన పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను కూడా కల్పించాలని పేర్కొంది. దీనివల్ల కార్పొరేట్ రంగానికి పెట్టుబడి నిధులపై భారం తగ్గడంతోపాటు దేశంలో పొదుపును కూడా ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. వృద్ధి, పెట్టుబడులు పుంజుకోవాలంటే సంస్కరణల అమలుతో పాటు పన్నుల యంత్రాంగాన్ని మెరుగుపరచడం కూడా చాలా కీలకమైన అంశమని పేర్కొంది.



వ్యాపారాలకు మెరుగైన పరిస్థితుల కల్పన.. కార్మిక, భూసేకరణ సంస్కరణలు, సబ్సిడీల హేతుబద్ధీకరణ, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల జోరు పెంచడం వంటివి కూడా ఆర్థికాభివృద్ధికి ప్రధానమైనవేనని సర్వే తేల్చిచెప్పింది.  కాగా, ద్రవ్యోల్బణం ప్రస్తుత తగ్గుముఖ ధోరణి కొనసాగుతుందని.. ఆర్‌బీఐ వృద్ధి అంచనాలను మించి జీడీపీ ప్రగతి నమోదుకానుందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ విలేకరులకు చెప్పారు.



ఆర్థిక సర్వే రూపకల్పనకు ఆయనే నేతృత్వం వహించారు. కాగా, ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్... రాష్ట్రాలు, కేంద్రం మధ్య మరింత సహృద్భావ వాతావరణ, సహకారానికి దోహదం చేయనుందని సర్వే వెల్లడించింది. 14వ ఫైనాన్స్ కమిషన్ గురించి ప్రత్యేక చాప్టర్‌లో పేర్కొంటూ.. కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుందని  పేర్కొంది. ఈ సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీల వ్యాఖ్యలను ప్రస్తావించింది.

 

సర్వే ఇంకా ఏం చెప్పిందంటే...

వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు(గేమ్ చేంజింగ్) సుసాధ్యం కానున్నాయి.

సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వం అనుసరించనున్న జన్‌ధన్-ఆధార్-మొబైల్(జామ్) వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా నగదు బదిలీ సులభతరం కానుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) జీడీపీలో 1 శాతానికి పరిమితం కావచ్చు.

రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 5-5.5 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. 2013 చివరినుంచి చూస్తే ద్రవ్యోల్బణం రేటులో 6 శాతంపైగా తగ్గుదల నమోదైంది.

వృద్ధి రేటుకు బూస్ట్ లభించాలంటే రిజర్వ్ బ్యాంక్ పాలసీ వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది.

భారీగా దిగొచ్చిన ముడిచమురు ధరలు, సంస్కరణలు, రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం వంటివి కూడా వృద్ధికి చేదోడుగా నిలవనున్నాయి.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఓ) నిధుల ప్రవాహం... డాలరుతో రూపాయి మారకం విలువ స్థిరపడేందుకు(ప్రస్తుతం 62 స్థాయిలో ఉంది) దోహదం చేసింది. ఏప్రిల్ 2014 నుంచి 38.4 డాలర్ల విదేశీ నిధులు దేశీ స్టాక్, డెట్ మార్కెట్లోకి ప్రవహించాయి.

దీనివల్ల దేశీ స్టాక్ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి సెన్సెక్స్ 31% పైగా దూసుకెళ్లింది.

 

ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం 3%...



ఆర్థిక క్రమశిక్షణ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సర్వే నొక్కిచెప్పింది.  రానున్న సంవత్సరాల్లో ద్రవ్యలోటును (ప్రభుత్వ ఆదాయ, వ్యయాల్లో వ్యత్యాసం) జీడీపీలో 3 శాతానికి పరిమితం చేయాలని నిర్ధేశించింది. ‘స్థిరమైన వృద్ధి పెరుగుదలకు ప్రభుత్వ పెట్టుబడులు చాలా కీలకం. దీనికోసం వ్యయాల నియంత్రణ, సబ్సిడీల తగ్గింపు-హేతుబద్ద్ధీకరణ ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలి.



డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా మరిన్ని నిధులను సమీకరించేలా చూడాలి. వీటన్నింటినీ ప్రభుత్వ పెట్టుబడులకు మళ్లించాలి. అయితే, ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి ప్రైవేటు రంగ పెట్టుబడులే ప్రధాన చోదకంగా పనిచేస్తాయి. దీనికి చేదోడుగా ప్రభుత్వ పెట్టుబడులను పెంచడంపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా రైల్వేల అభివృద్ధి వల్ల కనెక్టివిటీ పెరగడంతోపాటు రైల్వేలు ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజంలో కీలక ప్రాత పోషిస్తాయి. భవిష్యత్తులో ప్రభుత్వ రంగ పెట్టుబడుల కోసం మాత్రమే రుణ సమీకరణ అనే సిద్ధాంతాన్ని భారత్ అనుసరించాలి.

 

సంస్కరణలతోనే సర్వే లక్ష్యాలు సాధ్యం



న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే లక్ష్యాల సాధనకు ఆర్థిక సంస్కరణల కొనసాగింపు అవసరమని భారత్ పారిశ్రామిక ప్రతినిధులు పేర్కొన్నారు. ద్రవ్య పటిష్టత, దిగువస్థాయిలో ద్రవ్యోల్బణం ధోరణి కొనసాగుతుందని సర్వే పేర్కొంటున్నందున... సరళీకరణ పరపతి విధానాల వైపు పయనం, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ రూపకల్పనకు మార్గం సుగమం అవుతుందని, దీనివల్ల పటిష్ట వృద్ధికి బాటలు పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరీ పేర్కొన్నారు. పెట్టుబడుల వృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయమిదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు.

 

స్టార్టప్‌ల జోరు...



దేశంలో స్టార్టప్ కంపెనీలు జోరు మీద ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రస్తుతం 3,100 పైగానే దేశంలో స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి . టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల వృద్ధి దీనికి ప్రధాన కారణం. ఐటీ సంబంధిత అనుబంధ పరిశ్రమలు దేశంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. కన్సల్టెన్సీ మార్కెట్ల విషయంలో కూడా దేశం వేగంగా వృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ  మంచి వృద్ధి సాధిస్తోంది.

 

పసిడి దిగుమతి ఆంక్షల తొలగింపు



పసిడి దిగుమతులపై ఆంక్షలను తొలగించాల్సిన సమయమిది. ఇందుకు తగిన పరిస్థితులన్నీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో నెలకొన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు కట్టడి, దేశంలోని విదేశీ పెట్టుబడుల రాక, గణనీయ స్థాయిలో పెరిగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు, దాదాపు స్థిర మారకపు విలువల పరిస్థితి... ఇలా పలు ఆర్థిక అంశాలు నియంత్రణల తొలగింపునకు పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆంక్షల వల్ల అక్రమ రవాణా పెరుగుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనాంశం.

 

ఈ కామర్స్‌లో అద్భుత అవకాశాలు



భారత్ ఈ-కామర్స్ రంగం రానున్న ఐదేళ్ల కాలంలో 50 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుంది. ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరిస్తుండడం దీనికి ప్రధాన కారణం. అయితే ఇక్కడ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణపై కొంత ఆందోళన నెలకొంది.  వినియోగదారుల పరిరక్షణా చట్టంలో కొన్ని సవరణలను ప్రతిపాదిస్తున్నాం. పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం 2014లో ఈ కామర్స్ రంగం విలువ 16.4 బిలియన్ డాలర్లు. 2015లో ఇది 22 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.

 

వ్యవసాయానికి మరింత సహాయం



వ్యవసాయ రంగం అభివృద్ధికి మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో పరిశోధనలకు సంబంధించి పెట్టుబడులు పెరగాలి. గిడ్డంగులు వంటి బ్యాక్‌ఎండ్ మౌలిక సదుపాయాల కల్పనపైనా వ్యయాలు పెరగాలి. నీటి సరఫరా సదుపాయాలు మెరుగుపడాలి. సబ్సిడీలు లక్ష్యాలను చేరేలా లోటుపాట్లను సవరించాలి. రైతుల ఆదాయాలు పెరిగేలా వ్యవస్థలో మార్పులు జరగాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top