ఒకే బ్రాండ్‌పై జెట్ ఎయిర్‌వేస్ సేవలు!

ఒకే బ్రాండ్‌పై జెట్ ఎయిర్‌వేస్ సేవలు!


సబ్సిడరీ జెట్ కనెక్ట్‌లోనూ కాప్లిమెంటరీ మీల్స్ షురూ

న్యూఢిల్లీ: దేశీ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్‌వేస్.. సింగిల్ బ్రాండ్‌పైనే కార్యకలాపాలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మొత్తం ఎకానమీ క్లాస్‌లో దేశీయంగా సేవలందిస్తున్న సబ్సిడరీ సంస్థ జెట్ కనెక్ట్‌లో కూడా డిసెంబర్ 1 నుంచి పూర్తి స్థాయి సేవలను కల్పించనున్నట్లు గురువారం కంపెనీ ప్రకటించింది. అంటే విమానంలో ప్రయాణికులు పానీయాలు, ఆహార వస్తువులను డబ్బులిచ్చి కొనుక్కునే పద్దతికి స్వస్తి పలుకుతుంది. స్వయంగా కాంప్లిమెంటరీ మీల్స్‌తో పాటు ఇతరత్రా సేవలను కల్పిస్తుంది.



టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ ‘విస్తార’ త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో పోటీని తట్టుకునే చర్యల్లో భాగంగా జెట్ తాజా చర్యలకు ఉపక్రమిస్తోంది. ప్రస్తుతం దేశీయ విమానయాన సేవల కోసం జెట్ కనెక్ట్‌ను, అంతర్జాతీయ సేవలకు జెట్ ఎయిర్‌వేస్, చౌక విమానయానానికి సంబంధించి జెట్ లైట్ బ్రాండ్‌లను కంపెనీ వాడుకుంటోంది.



ఈ ఏడాది చివరికల్లా జెట్ కనెక్ట్, జెట్ లైట్‌ల బ్రాండ్‌లను తొలగించి.. జెట్ ఎయిర్‌వేస్ పేరుతో సింగిల్ బ్రాండ్ కిందే నడపాలనేది కంపెనీ ప్రణాళిక. ఈ దిశగా మొదటి చర్యల్లో భాగంగా జెట్ ఎయిర్‌వేస్, జెట్ కనెక్ట్ నిర్వహణలోని దేశీయ నెట్‌వర్క్ విమానాలన్నింటిలోనూ డిసెంబర్ 1, ఆతర్వాత ప్రయాణాల కోసం ఈ నెల 15, అటుతర్వాత బుక్ చేసుకున్న టికెట్లపై పూర్తి స్థాయి సేవలను పొందవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top