అమ్మకానికి బాంబినో బీబీనగర్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న బాంబినో అగ్రో ఇండస్ట్రీస్ రెండు ప్లాంట్లు, మెషినరీ, స్థిర ఆస్తులను సుమారు రూ.16.65 కోట్లకు విక్రయించాలని నిర్ణయించింది. వీటిలో తెలంగాణలోని బీబీనగర్తోపాటు మధ్యప్రదేశ్లని ఇండోర్ ప్లాంటు ఉంది. 2016 ఆగస్టు నుంచి ఇండోర్ ప్లాంటు నిరుపయోగంగా ఉంది. బీబీనగర్ ప్లాంటు ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేక వ్యయాలు తడిసిమోపెడు అవుతున్నాయని కంపెనీ తెలిపింది. 2016–17లో సాధించిన రూ.269.80 కోట్ల టర్నోవరులో ఈ రెండు ప్లాంట్ల నుంచి రూ.75.18 కోట్లు సమకూరింది. కాగా ఉత్తరప్రదేశ్, రాజస్తాన్లో అత్యాధునిక ప్లాంట్ల కొనుగోలుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
నష్టం రూ.1.5 కోట్లు..: మార్చి త్రైమాసికంలో బాంబినో అగ్రో ఇండస్ట్రీస్ రూ.1.5 కోట్ల నష్టం ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.72 లక్షల నికరలాభం ఆర్జించింది. టర్నోవరు రూ.60 కోట్ల నుంచి రూ.34 కోట్లకు పడిపోయింది. 2016–17లో నికర లాభం రూ.6.4 కోట్ల నుంచి రూ.3.4 కోట్లకు వచ్చి చేరింది. కాగా ఒక్కో షేరుపై రూ.1.60 డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది.