రామ్ చరణే మా బ్రాండ్ అంబాసిడర్..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్చరణ్ తేజ తమ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన ఇమేజ్కు తగ్గ సేవలు అందిస్తామని కొత్త విమానయాన సంస్థ టర్బో మేఘ మేనేజింగ్ డెరైక్టర్ వి. ఉమేష్ చెప్పారు. రామ్చరణ్ డెరైక్టర్గా కొనసాగుతున్న టర్బో మేఘ ఎయిర్వేస్కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమాన సర్వీసుల నిర్వహణ నిమిత్తం నో అబ్జెక్షన్ (ఎన్ఓసీ) జారీ చేసిన సందర్భంగా ఆ కంపెనీ కార్యకలాపాల్ని ఉమేష్ ‘సాక్షి ’కి వివరించారు.
వ్యాపార అవకాశాలు...
ఎయిర్వేస్ వ్యాపారంలో మంచి అవకాశాలున్నాయి. ఆక్యుపెన్సీ నిష్పత్తి పెంచుకుంటే లాభాలను ఆర్జించవచ్చు. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న పోటీ సంస్థ 80 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. మా బలం రామ్చరణ్ తేజ బ్రాండ్ ఇమేజ్. ఆయన ఇమేజ్ ఆధారంగా మా సంస్థ సేవలను నాణ్యత కోరే ప్రయాణికులకు అందుబాటు ధరల్లో అందిస్తాం. చరణే మా బ్యానర్.
మీ సంస్థ మూలధన నిర్మాణం గురించి చెప్పండి?
మా అధీకృత మూలధనం రూ. 15 కోట్లు. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ. 12 కోట్లు. ప్రస్తుతం సంస్థలో ఇద్దరే డెరైక్టర్లుగా ఉన్నాం. ఇది చాలా ప్రాథమిక దశ. ఒక ఆకృతికి తీసుకు రావడానికి కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది. బోర్డులోకి మరికొంత మంది చేరే అవకాశం ఉంది. ఇందులో రవాణా రంగ నిపుణులతోపాటు అంతర్జాతీయ కన్సల్టెంట్లు కూడా ఉంటారు.
మీ ఎయిర్లైన్స్ ప్రాజెక్టుకు క్యాపిటల్ అవసరాలను అంచనా వేశారా?
తొలి దశలో రూ. 50 కోట్లు అవసరం ఉంటుందని అంచనా. మూలధన సమీకరణకై హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐలు), హెడ్జ్ ఫండ్లు, ప్రైవేట్ ఈక్విటీ సమకూర్చే వారితో దశల వారిగా సంప్రదింపులు జరుగుతాయి. బలమైన బ్రాండ్ అంబాసిడర్ మా డెరైక్టర్ కావడంతో మూలధన సమీకరణ పెద్ద సమస్య కాకపోవచ్చు.
ఎన్ని విమానాలను కొనుగోలు చేయనున్నారు?
చెన్నై, బెంగళూరు, టుటికారిన్, మదురై, బెల్గాం, హుబ్లీ ప్రాంతాల మధ్య సర్వీసులను ప్రారంభించాలన్నది మా ప్రస్తుత ఆలోచన. దీనికోసం 68 సీట్లుంటే క్యూ-400 బొంబార్డియర్ ఎయిర్ క్రాఫ్ట్లను సిద్ధం చేస్తున్నాం. వీటిని ఫ్రెంచ్ సంస్థనుండి డ్రై లీజుకు తీసుకుంటున్నాం.
ఈ రంగంలో మీకున్న అనుభవం ఏమిటి?
టర్బో ఏవియేషన్ సంస్థను 2003లోనే ఏర్పాటు చేశాం. తొలుత ఎయిర్ డక్కన్ సంస్థకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించాం. 2007 నుండి ప్రధాన ఎయిర్లైన్స్ అయిన జెట్ , కింగ్ ఫిషర్, బ్లూడార్ట్, ఎయిర్ సహారా, ప్యారామౌంట్, స్పైస్ జె ట్, హెచ్ఏఎల్, ఎయిర్ ఇండియా సంస్థలకు ఈ సేవలను అందిస్తున్నాం. 2009 నుండి నాన్ షెడ్యూల్ ఆపరేటర్ లెసైన్స్తో చార్టర్ సేవలు అందిస్తున్నాం. రాబిన్సన్ ఆర్-44 హెలికాప్టర్తో దేశ వ్యాప్త చార్టర్ సేవలందించాం. ప్రస్తుతం హైదరాబాద్ నుండి రెండు సెస్నా లైట్ ట్విన్ ఇంజిన్ కార్పొరేట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్లను చార్టర్ సర్వీసులుగా నడుపుతున్నాం. దేశంలోని 20 ప్రధాన కార్పొరేట్ సంస్థలతో చార్టర్ సర్వీసులు అందించేందుకు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం.
మీ ఇతర ప్రణాళికలు...?
పూర్తి స్థాయి ఎయిర్లైన్గా ఎదగడమే మా లక్ష్యం. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోసం మా గ్రూపు సంస్థకు జీఎంఆర్ ఎయిరోపార్క్ ఎస్ఈజెడ్లో ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అలాగే విమానాల ఎయిర్ వర్తీనెస్ ధుృవీకరించేందుకు డెరైక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి అనుమతులు పొందాం. దీంతో ఇతర ఎయిర్ క్రాఫ్ట్లకు డీజీసీఏ తరుపున ఈ సేవలను అందించే అవకాశం ఉంది.