దొందూ దొందే..
విజయనగరంఫోర్ట్: ఎల్లమ్మను ఎంచక్కర్లేదు, పోలమ్మను పొగడక్కర్లేదు అన్నట్లు తయారయ్యింది గత,ప్రస్తుత అధికార పక్షాల పరిస్థితి. జిల్లా పరిషత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో వారేం చేశారో మేమూ అలాగే చేస్తామని ప్రసుత్తం అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అనురిస్తున్నారు. కాంగ్రెస్ నియమించిన డిప్యుటేషన్లు అన్నీ ఆక్రమ డిప్యుటేషన్లు అని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమాలకు తావివ్వమని గొప్పలు చెప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ అనుసరించిన విధానంలోనే ముందుకు పోతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ మాదిరి అనుయాయులను జిల్లా పరిషత్లోని కీలక పోస్టుల్లో నియమించుకునేందుకు టీడీపీ నేతలు సర్వం సిద్ధం చేశారు. గత 15 రోజులుగా నేతలు ఇదే పనిలో ఉండి 50 మందికిపైగా ఉద్యోగులను డిప్యుటేషన్పై నియమించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో టీడీపీ అనుకూల ఉద్యోగులు డిప్యుటేషన్ స్థానంలో విధుల్లో చేరనున్నారు.
37 మందిని రద్దు చేసి50 మందికిపైగా పోస్టింగ్లు
జిల్లా పరిషత్ పరిధిలో పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, ఆర్డబ్ల్యూఎస్శాఖలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమిం చిన 37 డిప్యుటేషన్లను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభస్వాతిరాణి రద్దు చేయించారు.