'ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకే వైఎస్ జగన్ దీక్ష'
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాహారదీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే వైఎస్ జగన్ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షకు రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు,బాధితులంతా హాజరుకానున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగానే మంగళగిరిలో వైఎస్ జగన్ చేపట్టబోతున్న దీక్షా ప్రాంతాన్ని శనివారం సుబ్బారెడ్డి పరిశీలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి టీడీపీ మహానాడులో కనీసం తీర్మానం కూడా చేయకపోవడాన్ని సుబ్బారెడ్డి తప్పుబట్టారు. చంద్రబాబుకు అసలు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదనడానికి ఇదొక ఉదాహరణగా అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతుంటే ఇంకా ఏ ముఖం పెట్టుకుని విజయ యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు.
సంబంధిత వార్తలు