28న వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీ సమావేశం

28న వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్లీనరీ సమావేశం - Sakshi


శ్రీకాకుళం అర్బన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 28న నిర్వహించ నున్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న ప్లీనరీని విజవంతం చేయాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాటాడారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల స్థాయి, జిల్లాలోని 10 నియోజకవర్గాలలో ప్లీనరీ సమావేశాలను నిర్వహించామని చెప్పారు.



 సమావేశాలు విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసిందన్నారు. ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను, అవినీతి, అన్యాయాలను ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్లడంలో సఫలీకృతమయ్యామన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరగనున్న జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశంలో 10 నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులన్నీ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



 సమావేశానికి జిల్లా పరిశీలకులు కొయ్య మోషేన్‌రాజు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్సీ కిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లు హాజరవుతారని పేర్కొన్నారు. పీఏసీ, సీజీసీ సభ్యులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, సంయుక్తకార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ పరిశీలకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, పార్లమెంట్‌ పరిశీలకులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, మాజీ చైర్‌పర్సన్లు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, సర్పంచ్‌లు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్లీనరీ సమావేశం విజయవాడలో జూలై 8, 9వ తేదీల్లో జరుగుతుందని, అక్కడికి కూడా అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top