టీడీపీ వేధింపులు తాళలేక వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

టీడీపీ వేధింపులు తాళలేక  వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం - Sakshi


తాడేపల్లిగూడెం రూరల్ : తెలుగుదేశం పార్టీ నాయకులు వేధించడంతో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన అతడు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటకు చెందిన చదలవాడ ఏడుకొండలు ఆటో నడపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఆటోలో ఎక్కించుకున్న ప్రయాణికులలో ఒక మహిళ ఆటో నుంచి జారిపడింది. ఆమెను ఆదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త బొల్లిపో ఆసన్నబాబు చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించాడు. అక్కడనుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తీసుకెళ్లారు.

 

 దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్ చదలవాడ ఏడుకొండలు కుటుంబ సభ్యులు గతనెల 29న ఆసన్నబాబుపై దాడిచేసి గాయపరిచారు. తనపై జరిగిన దాడిపై ఆసన్నబాబు  తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇది తెలుసుకున్న ఆటోడ్రైవర్ ఏడుకొండలు తన భార్యపై ఆసన్నబాబు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇది తెలుసుకున్న ఆసన్నబాబు మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుమందు తాగి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆసన్నబాబు కాగితంపై రాశాడు. పోలీసులు అతని నుంచి వివరాలు సేకరించారు. అతడు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై కఠారి రామారావు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top