అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
హైదరాబాద్ : అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసింది. ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు కాగానే అంగన్వాడీ కార్యకర్తల జీతాలు రూ.10వేలు చేయాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై మంత్రి పీతల సుజాత సమాధానమిచ్చారు. దీనిపై వివరణ కోరిన సభ్యులకు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో.. ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసింది. దీనిపై వైఎస్ జగన్ మాట్లాడుతూ అంగన్ వాడ కార్యకర్తల సమస్యలపై సమాధానం ఇవ్వకుండా డొంకతిరుగుడుగా మాట్లాడటం సరికాదన్నారు.
అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాలు సజావుగా ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమం మొదలైంది. అంగన్వాడీ కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యురాలు ఉప్పులేటి కల్పనతో సహా పలువురు సభ్యుల ప్రశ్నలకు స్త్రీ శిశు సంక్షేమ మంత్రి పీతల సుజాత సమాధానమిచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం.. అంగన్వాడీ కేంద్రాలకు సరైన బిల్డింగ్.. తదితర విషయాలపై సభ్యులు వివరణ కోరారు.