గ్రామస్థాయిలో వైఎస్ఆర్సీపీ పటిష్టతకు కృషి
శ్రీకాకుళం అర్బన్:రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, గ్రామస్థాయిలో మరింత పటిష్టపరిచే చర్యల్లో భాగ ంగా ఈ నెల 28 పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తున్నామని ఆ పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బలపడుతుండటాన్ని సహించలేకే తెలుగుదేశం నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఎన్నికల వాగ్దానమైన వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ విషయంలో పూటకో మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు.
తుపానుకు దెబ్బతిన్న ఉత్తరాంధ్ర జిల్లాల కు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఇంతవరకూ కమిటీ రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తి అలసత్వం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ భవిష్యత్తు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. 28న ఉదయం పది గంటలకు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగే సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం,
ఆర్.కె.రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వంగవీటి రాధాకృష్ణ, ఎం.ఎస్.నాగిరెడ్డి, గౌతంరెడ్డి, చల్లా మదుసూధన్రెడ్డి, బాలరాజు తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే ఈ సమావేశానికి పార్టీ, అనుబంధ విభాగాల నాయకులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, గొండు కృష్ణమూర్తి, చల్లా అలివేలు మంగ, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ్, కె.ఎల్.ప్రసాద్, మండవిల్లి రవి, టి.కామేశ్వరి, పాలిశెట్టి మధుబాబు, కోరాడ రమేష్, గుడ్ల మల్లేశ్వరరావు, బరాటం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.