అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు, లోకేశ్‌


గుంటూరు : అవినీతి విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు మూడేళ్ల పాలనలో భయంకరమైన అవినీతి జరిగిందన్నారు. శనివారం అంబటి రాంబాబు గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని అవినీతి అధికారుల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామంటున్నారని, కేవలం అధికారులే అవినీతికి పాల్పడుతున్నారా అని అంబటి సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.



ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఇంతవరకూ ఆ గొంతు తనదో కాదో ఎందుకు చెప్పలేదని అంబటి ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని బిన్‌లాడెన్‌ మాట్లాడినట్లు...అవినీతిని అణచివేయాలని చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వృద్ధాప్య పింఛన్ల కోసం, జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సి వస్తోందని, అలాగే అధికారుల బదిలీలకు లంచం తీసుకునే స్థాయికి మంత్రి లోకేశ్‌ దిగజారరని విమర్శించారు.


అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు, లోకేశ్‌ అని అంబటి వ్యాఖ్యానించారు. పసుపు, మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్‌ విఫలం అయిందన్నారు. మే 1,2 తేదీల్లో గుంటూరులో రైతుల కోసం వైఎస్‌ జగన్‌ చేస్తున్న దీక్ష ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చేందుకేనని అంబటి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top