జేసీ తీరు మార్చుకోకుంటే రాజకీయ సమాధే
రాజంపేట: తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తన తీరు మార్చుకోకపోతే రాజకీయంగా సమాధి కాక తప్పదని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పార్టీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. వారు శుక్రవారం రాజంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని చెప్పారు.
అలాంటి వైఎస్ కుటుంబాన్ని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు జేసీ దివాకర్రెడ్డికి లేదన్నారు. జేసీ ఏ ఎండకు ఆ గొడుకు పట్టే సంస్కృతిని ఆకళింపు చేసుకొని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీని విమర్శించడానికే జేసీ దివాకర్రెడ్డి లాంటి వారిని పక్కన పెట్టుకున్నారని వారు ఆరోపించారు.
వైఎస్ కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్న చంద్రబాబు
రాష్ట్రంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో అనేక ప్రాజెక్టులకు ప్రాణం పోసిన జలదాత వైఎస్ రాజశేఖరరెడ్డి అని మిథున్రెడ్డి, అమర్నాథరెడ్డి కొని యాడారు. వైఎస్ కష్టాన్ని, కృషిని ఇప్పుడు చంద్రబాబు సొమ్ము చేసుకునేందుకు ప్రయ త్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారని చెప్పారు. చంద్రబాబుకు వైఎస్తో పోల్చుకొనే స్థాయి లేదని అన్నారు.
పులివెందుల ప్రాంతానికి నీళ్లు అందించాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి పైడిపాలెం ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారనే విషయం జిల్లా ప్రజానీకానికి తెలుసని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు, రైతుల నుంచి ఆయనకు ఆదరణ ఉండదన్నారు పత్రికల్లో ప్రకటనలు గుప్పించేందుకు మాత్రమే టీడీపీ పాలన పరిమితమైందని విమర్శించారు. ఈ సమా వేశంలో వైఎస్సార్సీపీ రాజంపేట పట్టణ కన్వీనర్ పోలా శ్రీనువాసులురెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.