‘అన్ని స్టేలు తెచ్చుకుంది చంద్రబాబు ఒక్కడే’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిరసనతో పాటు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు మొన్నటివరకూ హోదా కావాలన్నారని, అయితే ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రత్యేక హోదా వద్దంటున్నారని అన్నారు.
ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు నాయుడు ఏపీని తాకట్టు పెట్టారని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. దేశంలోనే 18 కేసుల్లో న్యాయస్థానాల నుంచి స్టేలు తెచ్చుకున్న సీఎం ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్టేలపై న్యాయస్థానాలు పున:సమీక్ష చేయాలని వైఎస్ అవినాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నీతిమంతుడైతే చంద్రబాబు విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్పై కేసుల విషయంలో టీడీపీ, కాంగ్రెస్ ఆడిన పొలిటికల్ డ్రామా అని వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాట కోసం నిలబడ్డారనే జగన్పై కేసులు బనాయాఇంచారని, వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంతకాలం జగన్పై ఒక్క కేసు కూడా లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ చనిపోయాకే కేసులు పెట్టారన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఏనాడు సచివాలయంలో అడుగు కూడా పెట్టలేదని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.