'చేసిన తప్పులను కప్పిపుచ్చుతున్నారు'
హైదరాబాద్: ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు టీడీపీ సహకరించినా.. ఇప్పుడు ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ యత్నించడాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర విభజనకు వైఎస్సార్ సీపీనే కారణమని అధికార టీడీపీ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతర వ్యక్తం చేశారు. శాసనసభ సాక్షిగా అధికార పార్టీ సభ్యుల తీరు సరిగా లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు.
అసలు రాష్ట్ర విభజన జరిగి తీరాలని లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అయితే, దాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై నెట్టేందుకు యత్నించడం సరైన పద్దతి అనిపించుకోదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. టీడీపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని ఇతర పార్టీలపై నిందలు వేయడం తగదన్నారు. ఆరోపణలు చేసేటప్పుడు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన టీడీపీకి సూచించారు. కాగా, సభలో అధికార పార్టీ సభ్యుల తీరు అభ్యంతకరంగా ఉందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడకుండా పదే పదే మైక్ కట్ చేయడాన్ని చెవిరెడ్డి తప్పుబట్టారు.