నాలుగు గోడల మధ్య ప్రసంగాలు కాదు
► ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ఆగ్రహం
వీరఘట్టం: ‘సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి వ్యాఖ్యలను ప్రపంచమంతా సమర్థిస్తోంది. ఒక ఎమ్మెల్యేగా నేను ఆయన వ్యాఖ్యలను సమర్థించడంలో తప్పులేద’ని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి స్పష్టంచేశారు. శుక్రవారం వీరఘట్టంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమె మాట్లాడుతూ.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న నిమ్మక జయకృష్ణ.. నాలుగు గోడల మధ్య మాట్లాడటం కాదన్నారు. ప్రజల్లోకి వచ్చి చూస్తే నిజాలు, ప్రజల ఇబ్బందులు తెలుస్తాయని వివరించారు.
టీడీపీ అరాచక పాలనలో ప్రజలు ఎంతగా నలిగిపోతున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు. ఓ రోజు అసెంబ్లీలో ప్రతి పక్ష ఎమ్మెల్యేలను పనికిమాలిన దద్దమ్మలని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు అన్నారని, ఇటువంటి వ్యాఖ్యలు టీడీపీ నేతలు అప్పుడు ఎందుకు సమర్థించారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం నైతిక విలువలు కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల ఉప ఎన్నికలే టీడీపీకి గుణపాఠం చెబుతాయన్నారు. మండలంలోని అడారు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నీలం అప్పలనాయుడు గురువారం మృతి చెందారు. దీంతో శుక్రవారం ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యలు సర్పంచ్ నీలం జయమ్మ,నీలం సత్యంనాయుడు,నీలం తిరుపతిరావు తదితరులను పలకరించారు.