లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష సమావేశం
హైదరాబాద్:రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్న నేపథ్యంలో ఆదివారం వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం సమావేశమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్ లో జరుగుతున్న శాసనసభాపక్ష సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
రేపట్నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ దాని మిత్రపక్షం బీజేపీ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోని వచ్చి 14 నెలలు అయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అంటూ మంత్రులతోపాటు నాయకులు అడపాదడపా ప్రకటిస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ప్రత్యేక హోదాపై ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశాలపై అధినేత...ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.