చంద్రబాబు మోసాలపై విస్తృత ప్రచారం
వైఎస్సార్సీపీ చోడవరం సమన్వయకర్త
కరణం ధర్మశ్రీ
‘దగా బాబుపై దండోరా’ ప్రారంభం
చోడవరం: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. టీడీపీ ఏడాది పాలనలో ప్రజలకు చేసిన మోసాన్ని ఎలుగెత్తుతూ ‘దగాబాబుపై దండోరా’ కార్యక్రమాన్ని చోడవరం మండలంలో శుక్రవారం ప్రారంభించారు. మొదటి రోజు చాకిపల్లి, జన్నవరం, తిమ్మనపాలెం, బెన్నవోలు, కన్నంపాలెం, గాంధీగ్రామం, నర్సయ్యపేట గ్రామాల్లో కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు మోసాన్ని నిలదీస్తూ ఆయా గ్రామాల్లో ర్యాలీలు, ప్రజలు, రైతులతో చైతన్య సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ ఎన్నికల్లో గుప్పించిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబునాయుడు ప్రజలను మోసంచేశారన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి చివరికి ఏ ఒక్కరికీ పూర్తిగా మాఫీచేయాలేదన్నారు. నిరుద్యోగభృతి గురించి కనీసం ప్రస్తావించని ముఖ్యమంత్రి, అర్హులైన వారికి సైతం ఫించన్లు తొలగించి రోడ్డున పడేలా చేశారన్నారు. కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చకపోగా ఉన్న ఉద్యోగాలను తీసేసి మరింత నిరుద్యోగులను పెంచారని, దీనివల్ల అనేక కుటుంబాలు జీవనాధారం కోల్పోయి బ్రతుకుభారంతో జీవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైఎస్ హయాంలో అర్హులందరికీ పక్కాగృహాలు, పింఛన్లు, రేషన్కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలన్నీ మంజూరుచేస్తే చంద్రబాబు వచ్చాక ఒక్క ఇల్లు కాదుకదా కనీసం ఒక్క రేషన్ కార్డుకూడా మంజూరు చేయలేదన్నారు. ఇటువంటి దగాబాబుపై దండోరా వేసి ప్రజలను మేలుకొల్పేందుకే వైఎస్సార్సీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ధర్మశ్రీ చెప్పారు. పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పికొండ లింగబాబు, మారిశెట్టి శ్రీకాంత్, డీసీసీబీ డైరక్టర్ మూడెడ్ల మహాలక్ష్మి శంకరరావు, ఏడువాక సత్యారావు, మండల బీసీసెల్, ఎస్సీసెల్, రైతు, మహిళా విభాగాల అధ్యక్షులు మొల్లి ప్రసాద్, గాడి అప్పారావు, మట్టారాజునాయుడు, పోతల రమాదేవి, ఎంపీటీసీ బైన ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.