ఏం చేశారని నవనిర్మాణ దీక్ష?

ఏం చేశారని నవనిర్మాణ దీక్ష? - Sakshi


చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం



 హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాదిలో ఏం సాధించారని నవనిర్మాణ దీక్ష చేపడతారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ 11 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. విభజనకు లేఖలిచ్చిన వ్యక్తి విధ్వంసం పునాదులపై నవనిర్మాణం చేస్తారా? అని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ విషయంలో నిలువునా మోసం చేశారని, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయమంటూ కుచ్చు టోపీ పెట్టారని, నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఏమీ చేయకుండానే అన్నీ చేసేశామని చెప్పి మీడియా ప్రచారంతో కాలం గడిపారని ఎద్దేవా చేశారు.



తెలంగాణ రావడానికి తానే కారణమని ఆ ప్రాంతంలో ఘనంగా చెప్పుకున్న చంద్రబాబు విభజన హామీల్లో ఒక్కటైనా ఈ ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోగలిగారా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చే సేసినట్లుగా పత్రికలకు లీకులు ఇచ్చి వార్తలు రాయించుకున్నారని...  అసలు ఎంతమేరకు, ఎప్పటివరకు రుణాలు మాఫీ చేస్తారనే విషయమే ఎక్కడా అధికారికంగా చెప్పలేకపోయారని తూర్పారబట్టారు. దివంగత వైఎస్  హయాంలో పావలా వడ్డీకే రుణాలు పొందిన మహిళలు చంద్రబాబు మాటలు విని మోసపోయి, ఇపుడు రుణాలు లేనిస్థితిలో ఉండి పోయారన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top