'పట్టిసీమ ఏడాదిలో ఎలా సాధ్యం'

'పట్టిసీమ ఏడాదిలో ఎలా సాధ్యం' - Sakshi


హైదరాబాద్ :  పట్టిసీమ ప్రాజెక్టు కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా ఏడాదిలో నిర్మాణాన్ని ఎలా పూర్తిచేస్తారని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి ప్రశ్నించారు.ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. పట్టిసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకంత మోజు అని ఆయన మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టుపై 22శాతం ఎక్సెస్ టెండర్లపై ఉన్న తాపత్రయంతోనే బాబు ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టెండర్ల విషయంలో చూసిన తాపత్రయం మౌలిక వసతులకల్పనలో ఎందుకు చూపించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ పట్టిసీమ పూర్తయినా దీనిద్వారా రాయలసీమకు నీరు ఎలా సాధ్యమవుతుందన్నారు. పట్టిసీమపై ఉన్న మోజు పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు చూపెట్టడం లేదని చంద్రబాబుని విమర్శించారు.



రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. గతంలో సీఎంగా పనిచేసినప్పుడు ఈ ప్రాజెక్టు ఆలోచన బాబుకు ఎందుకు రాలేదని పార్థసారథి ప్రశ్నించారు. ప్రాజెక్టులు గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాలు కాగా, చివరి దశ పనులు మాత్రమే చేసి అంతా తన ఘనతగా బాబు చిత్రీకరిస్తారన్నారు. గాలేరు- నగరి ప్రాజెక్టు ఏడాదిలో పూర్తిచేసేటట్లయితే ఇంతకాలం ఎందుకు పూర్తిచేయలేక పోయారన్నారు. హంద్రీ- నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల లైనింగ్ లకు టెండర్లు పిలవక పోవటంతోనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top