ముద్రగడ ఏమైనా విద్రోహ శక్తా?: బొత్స

ముద్రగడ ఏమైనా విద్రోహ శక్తా?: బొత్స


హైదరాబాద్‌ : చంద్రబాబు నాయుడు పాలన చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉందా? లేక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని వైఎస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలీస్‌ పాలన నడుస్తోందని ఆయన విమర్శించారు.


బొత్స సత్యనారాయణ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాకినాడ నుంచి అమరావతి వరకూ వేలమంది పోలీసులు ఎందుకు మోహరించారని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గం మొత్తం బైండోవర్‌ చేస్తారా?, ముద్రగడ పద్మనాభం ఏమైనా దేశద్రోహానికి పాల్పడుతున్నారా?, ఆయన ఏమైనా విద్రోహశక్తా?  అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కర్ఫ్యూను తలపిస్తోందని అన్నారు.



ముద్రగడను నిర్బంధిస్తే కాపుల్లోని ప్రతి ఒక్కరు ముద్రగడలా మారతారని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమ అరెస్ట్‌లను వైఎస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీల అమలు కోసం ఎవరు పోరాడినా వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతు ఇస్తుందన్నారు. కాగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న నుంచి చలో అమరావతి పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పాదయాత్రకు అనుమతి లేదంటూ ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. తూర్పు గోదావరి జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోనూ భారీగా పోలీసులు మోహరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top