రైతులను పచ్చిగా మోసగించారు
రుణ మాఫీపై అంబటి ఆగ్రహం
హైదరాబాద్: రైతు రుణాల మాఫీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు సీమాంధ్ర రైతులను పచ్చిగా మోసం చేశారని, దగాకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణాల మాఫీపై మంత్రివర్గ సమావేశ అనంతరం చంద్రబాబు చేసిన ప్రకటనపై అంబటి పార్టీ కార్యాలయంలో తీవ్రంగా స్పందించారు. ఆయనేమన్నారంటే... ‘‘తల్లులారా... అక్కలారా... చెల్లెళ్లారా... నాకు ఓటేయండి, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతో మీ వ్యవసాయ రుణాలన్నీ అణా పైసలు సహా మాఫీ చేస్తా...
మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన నగలన్నీ ఇంటికి వస్తాయని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన చంద్రబాబు ఇపుడు చేసిందేమిటి? లక్షన్నర లోపు రుణాలు మాత్రమే రద్దవుతాయంటున్నారు. అది కూడా కుటుంబానికి ఒక్కటే రుణం రద్దవుతుందంటున్నారు. బంగారంపై తెచ్చుకున్న రుణాలు 50 వేల రూపాయల మేరకే రద్దు అంటున్నారు. ఇన్ని ఆంక్షలు పెడతానని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పలేదే! అధికారంలోకి రావటానికి కారణమైన రుణమాఫీ పథకం అమలులో బాబు విఫలమయ్యారు. రైతులను దారుణంగా వంచించారు. ఇప్పటికైనా చంద్రబాబు రుణాలన్నింటినీ మాఫీ చేయాలి’’అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.