పోలవరం వేగం పెంచండి

పోలవరం వేగం పెంచండి - Sakshi


ప్రాజెక్టుపై భయాలను తొలగించండి.. ‘పట్టిసీమ’ను ఆపించండి ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినతి

 ‘పట్టిసీమ’ పేరుతో చంద్రబాబు నిర్వాకాన్ని ప్రధానికి వివరించాం

 డబ్బులు దండుకోవడానికే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారు

 తన వారికి టెండర్ ఇప్పించి.. ఎక్సెస్‌ను బోనస్‌గా సమర్థించుకున్నారు

 ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 70 టీఎంసీల నీళ్లు కోల్పోయే ప్రమాదం

 ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు వంటి హామీలను

 కచ్చితంగా అమలు చేయాలన్నాం

 మోదీతో భేటీ తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించిన జగన్

 

 సాక్షి, న్యూఢిల్లీ: పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానాలు.. ఆ ప్రాజెక్టు కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తలెత్తుతున్న ఆందోళనలు, భయాల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించామని.. వీటి ని నివృత్తి చేయాలని కోరామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మించటంతో పాటు.. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేసేలా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ‘‘గతంలో ఓసారి ప్రధానమంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విషయాలపై విన్నవించాం. వాటినే మళ్లీ ఒకసారి గుర్తుచేయాలని వచ్చాం. కచ్చితంగా వాటిని అమలు చేయాలని విన్నవించాం.

 

 ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమలు చేయాలని కోరాం. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అడిగాం. రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేశాం. పారిశ్రామికాభివృద్ధి, ప్రత్యేక ప్రోత్సాహకాలు, రైల్వే జోన్ అడిగాం. ఎయిమ్స్ తదితర జాతీయ స్థాయి విద్యాసంస్థలను సత్వరం ఏర్పాటు చేయాలన్నాం. వీటన్నింటి కీ తోడు.. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చాం’’ అని ఆయన వివరించారు. సోమవారం ఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డులో ప్రధాని నివాసంలో నరేంద్రమోదీని.. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో పాటు కలిసిన జగన్‌మోహన్‌రెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

 

 పట్టిసీమపై భయాలను నివృత్తి చేయాలని కోరాం...

 

 ‘‘పట్టిసీమ అన్న ప్రాజెక్టు ఏరకంగా పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్‌లో పడేసే పరిస్థితి తీసుకొస్తుందేమోనని మా భయాలు, ఆందోళనలు చెప్పాం. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాల్సిన ఆవశ్యకతను చెప్పాం. గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ చెప్పినట్టుగా 7(ఇ), 7(ఎఫ్) నిబంధనల మేరకు ఏ రకంగా రాష్ట్రానికి అన్యాయం జరగనుందో వివరించాం. 7(ఇ) ప్రకారం పోలవరం పనులు మొదలుపెట్టిన వెంటనే, సీడబ్ల్యూసీ అనుమతి వచ్చిన వెంటనే 35 టీఎంసీల నీటిని పైన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు ఇవ్వడం మానేసే ప్రమాదం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి తో సంబంధంలేకుండా 35 టీఎంసీలు పోతాయని ఓవైపు ఆందోళన ఉంది. మరోవైపు 7(ఎఫ్) క్లాజ్ ఇంకా ప్రమాదకరమైంది. గోదావరి నుంచి ఎన్ని నీళ్లు మళ్లిస్తారో.. వాటికి సమానంగా కర్ణాటక, మహారాష్ట్రలు కూడా వాటా అడిగే హక్కు ఉంటుందని ఆ క్లాజ్ చెబుతోంది. వీటిని కూడా ప్రధానమంత్రికి వివరించాం. పట్టిసీమకు పునాది రాయి వేశారు కాబట్టి ఈ క్లాజ్ చూపి 35 టీఎంసీల నీటిని ఆపేస్తాయని భయంగా ఉంది. మా భయాల మధ్య ఈ ప్రాజెక్టు సాగుతోంది. వీటిని నివృత్తిచేయాలని విన్నవించాం. పైగా పట్టిసీమ ప్రాజెక్టును స్టోరేజీ కెపాసిటీ లేకుండా కడుతున్నారు. స్టోరేజీ కెపాసిటీ ఉంటేనే వరద వచ్చినప్పుడు నిల్వ చేసుకోగలుగుతాం.

 

 అలా స్టోరేజ్ చేసుకునే సామర్థ్యమే పోలవరం ప్రాజెక్టు. 119 టీఎంసీల నీటిని స్టోర్ చేసుకునే సామర్థ్యం పోలవరం ఇస్తుంది. మరి పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఎందుకు ఇంత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇది రాయలసీమ ప్రజలపై ఉన్న ప్రేమ ఎంతమాత్రం కాదు. ఆయనకు నిజంగా రాయలసీమపై ప్రేమ ఉంటే.. అక్కడి ప్రాజెక్టులు పూర్తయ్యేలా నిధులు కేటాయించేవారు. ఆయనకు ఎంత ప్రేమ ఉందో రాయలసీమ ప్రాజెక్టుకు కేటాయిం చిన నిధులను పరిశీలిస్తే అర్థమవుతుంది. గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తికావాలంటే రూ. 2,600 కోట్లు కావాలి. కానీ ఇచ్చింది రూ. 169 కోట్లు మాత్రమే. హంద్రీ - నీవా పూర్తికావాలంటే రూ. 1,100 కోట్లు కావాలి. కానీ ఇచ్చింది రూ. 200 కోట్లు. వెలిగొండకు రూ. 150 కోట్లు కేటాయించారు. కానీ పూర్తికావాలంటే రూ. 1,500 కోట్లు కావాలి. బాబు చేసిన కేటాయింపులు నిర్వహణకే సరిపోతాయి. ప్రాజెక్టుల పూర్తికి సరిపోవు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

 

 బియ్యం సేకరణ జరగాలి...

 

 ‘‘ఇదికాకుండా శాంతకుమార్ కమిటీ నివేదికను అమలుచేయరాదని ప్రధానిని కోరాం. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణను ఆపేస్తే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతారు. కనీస మద్దతు ధర దిగజారిపోతుంది. 2010-11లో ఎఫ్‌సీఐ ఇదేమాదిరిగా వెనకడుగు వే సినప్పుడు రైతులకు కనీస మద్దతు ధర దొరకక, క్వింటాలుకు రూ. 300 కూడా దొరకని పరిస్థితిలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతిని ప్రధాని దృష్టికి తెచ్చాం. ఈ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని కోరాం. సానుకూలంగా స్పందించారు. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని జగన్ వివరించారు.

 

 ఆ రోజు చంద్రబాబును ఈ ప్రశ్న అడగలేదేం?

 

 ‘ఇది ముఖాముఖి సమావేశమా? అందరూ కలిశారా?’ అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘చీకట్లో చంద్రబాబు చిదంబరంను కలిసినప్పుడు మీరు ఎందుకు అడగలేదు? చిదంబరమే స్వయంగా పార్లమెంటులో ఈ విషయం చెప్పారు. ఆ రోజు ఎఫ్‌డీఐ అంశంపై పార్లమెంటులో ఓటింగ్ జరుగుతున్నప్పుడు మన కళ్ల ముందే చంద్రబాబు తన ఎంపీలను గైర్హాజరు చేయించారు. నేను ఏడు మంది ఎంపీలతో కలిశాను. కలిసి వచ్చాక నోట్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఏం మాట్లాడామో చెబుతున్నాం. మీరు ఎందుకు ఆ రోజు చంద్రబాబును అడగలేదు. ఏ నాయకుడైనా ఇంకొక నాయకుడిని కలిసినప్పుడు డెలిగేషన్ ఇచ్చిన తరువాత కచ్చితంగా ఓ ఐదు నిమిషాల పాటు కుశల ప్రశ్నలు వేసి.. సంబంధాలు బాగుండాలని చెప్పి చూసుకుని వస్తారు..’’ అని పేర్కొన్నారు.

 

 అధికారంలో ఉన్న

 చంద్రబాబు ఏం చేస్తున్నారు?

 

 ‘స్పెషల్ స్టేటస్ వస్తుందంటారా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘స్పెషల్ స్టేటస్‌పై నరేంద్రమోదీని రెండు సార్లు కలిశాం. ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులను గతంలో కలిశాం. చేయగలిగిందంతా చేస్తాం. అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారు? మాది చిన్న బలం. అడగగలుగుతాం. మేం చేయగలిన ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాం. మంత్రివర్గంలో మేం లేం కదా..! బయటకు రావడానికి...’’ అని జగన్ పేర్కొన్నారు. రాయలసీమ ప్రగతిని వైఎస్సార్ సీపీ కోరుకోవడం లేదని బాబు ఆరోపిస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘నేనిప్పటివరకు చాలా స్పష్టంగా చెప్పాను. 7 ఈ, 7 ఎఫ్ అని చెప్పాను. చంద్రబాబు పుణ్యంగా రేపు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు 70 టీఎంసీల నీటిని ఆపేస్తే.. మేం ఎక్కడికిపోవాలి? ఎవరి దగ్గరికి పోవాలి? ఏంచెప్పాలి మా భయాలు? చంద్రబాబు వేరే ప్రాజెక్టులు చేస్తానంటే మేం అడ్డుపడలేదే. చేయండనే చెబుతాం. ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలనే చెబుతాం. కానీ ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న దానిని మనం కాపాడుకోవాలి కదా...’’ అని వ్యాఖ్యానించారు.

 

 

 ‘‘చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును ఎం దుకు చేపడుతున్నారంటే.. తనకు సంబంధించిన కాం ట్రాక్టర్లకు వర్క్ ఇప్పించుకున్నాడు. అది కూడా టెండరుకు ఉండాల్సిన అవశ్యమైన నిబంధనలను మార్చేసి.. పోటీ లేకుండా చేసి.. తనకు సంబంధించిన కాంట్రాక్టర్లు మాత్రమే కోట్ చేసేలా చేసి.. తన సంబంధిత వ్యక్తులకు టెండర్లు వచ్చేలా చేసుకున్నారు. ఆ టెండర్లలో కూడా 21.9 ఎక్సెస్ కోట్ చేస్తే.. ఆ ఎక్సెస్ కోట్ చేసిన దాంట్లో అనుమతించదగిన 5 శాతం మేరకు ఒప్పుకుంటూ.. మిగిలిన 16.9 శాతాన్ని బోనస్‌గా డిక్లేర్ చేశారు. టెండర్లు పిలిచేటప్పుడు ఆ బోనస్ అంశం లేదు. కోట్ చేసిన తరువాత ఆ ఎక్సెస్ అమౌంట్‌ను బోనస్‌గా సమర్థించుకోవటం ఇంతవరకు దేశచరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అది కూడా ఒక  ఏడాదిలో పూర్తిచేయాలని పిలిచి.. టెండర్లు దాఖలయ్యాక అదే సంవత్సరంలో పూర్తిచేస్తే బోనస్ ఇస్తామని పేర్కొనడం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనూ, దేశచరిత్రలోనూ, టెండర్ చరిత్రలోనే బహుశా ఎప్పుడూ లేని అంశం. ఇది పూర్తిగా చంద్రబాబు డబ్బులు దండుకునేందుకు చేశారని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లాం’’ అని జగన్ చెప్పారు.


 




 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top