అగ్రిగోల్డ్‌ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి

అగ్రిగోల్డ్‌ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి - Sakshi


న్యూఢిల్లీః  అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఆయన లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అగ్రిగోల్డ్‌ సంస్థ లక్షలాది మంది నుంచి రూ. 7 వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించిందని, ప్రజలు జీవితకాలమంతా కష్టించి దాచుకున్న డబ్బులను ఈ సంస్థలో డిపాజిట్‌ చేశారని వివరించారు. దాదాపు రూ. 7 వేల కోట్ల మేర ఈ సంస్థ దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు.



2015 ఫిబ్రవరిలో ఈ వ్యవహారం ఒక కుంభకోణమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, హైకోర్టు సైతం ఈ కుంభకోణాన్ని తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులను అమ్మలేదని తెలిపారు. బాధితులకు నష్టపరిహారం అందలేదని, ఈ విషయంలో ఎందుకింత జాప్యం జరుగుతోందని తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. సంబంధిత ఆస్తులను రాజకీయ నేతలు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే సంస్థ ఆస్తుల అమ్మకాల్లో జాప్యం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాధితుల్లో దాదాపు 100కు పైగా డిపాజిటుదారులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించిందని వివరించారు. అవినీతి రహిత భారతదేశాన్ని కాంక్షిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top