పెచ్చుమీరుతున్న టీడీపీ ఆగడాలు
ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నంద్యాల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ ఆగడాలు శృతిమించుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఘాటుగా ఫిర్యాదు చేసింది. పార్టీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ శనివారం రాత్రి ఎన్నికల సంఘం అదనపు సీఈవో అనూప్సింగ్ను కలసి నంద్యాల్లో టీడీపీ అడ్డగోలు వ్యవహారాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. సీఎం వంట వాహనం తనిఖీ విషయంలో శుక్రవారం హైడ్రామా నడిపించారని, ఇదే వాహనంతో వెళ్లిన మరో రెండు వాహనాలను తప్పించినట్టు స్థానికులు చెబుతున్నారని తెలిపారు.
ఆ వాహనాల్లో అధికార పార్టీ పెద్ద ఎత్తున నగదు తరలించినట్టు అనుమానాలు బలపడుతున్నాయని, దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపించాలని కోరారు. టౌన్లెవల్ ఫెడరేషన్, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, స్వయం సహాయక బృందాలను ప్రలోభపెడుతున్నారని ఈసీకి వివరించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని బెదరిస్తున్నారని పేర్కొంటూ, వారి పేర్లతో సహా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు.