పోలీస్స్టేషన్లోనే రక్షా బంధన్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ సందర్భంగా అరెస్టయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీస్స్టేషన్లోనే రాఖీ పండగ జరుపుకున్నారు. జిల్లా పార్వతీపురంలో బంద్లో పాల్గొన్న పార్టీ సాంస్కృతిక విభాగం నేత వంగపండు ఉష, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రసన్నకుమార్తో పాటు వామపక్షాల నేత శ్రీరామమూర్తి తదితరులను శనివారం ఉదయం స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. వారు అక్కడే రాఖీలు కట్టుకుని, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఎమ్మెల్యే వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే కంబాల జోగులు అరెస్ట్
బంద్ సందర్భంగా పోలీసులు ముందస్తు చర్యగా రాజం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. సుమారు 35 మంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా బంద్కు మద్దతిచ్చిన వామపక్షాలకు చెందిన మరో 18 మంది నాయకులను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. కాగా, అరెస్ట్లు చేసేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకునే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వైఎస్సార్సీపీ నేత విజయ్కుమార్ తీవ్రంగా అస్వస్తతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.