'లోకేశ్ కనీసం సర్పంచి కూడా కాదు..'
అమరావతి: టీడీపీ మహానాడు సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని పొగడటం ప్రతిపక్షాలను తిట్టడం, వంటకాల రుచులను గురించి చర్చించడం తప్ప మరే అంశాన్ని ప్రస్తావించలేదని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని మోసం చేసి ఆక్రమించుకున్న వ్యక్తి చంద్రబాబునాయుడని ఆయన ధ్వజమెత్తారు. రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా కడప జిల్లా తీర్మానాన్ని అమర్నాథ్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన తీర్మానం అంశంగా ఏం చెప్పారంటే ' వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్లీనరీలో నిరంతరాయం ఫలప్రదమైన చర్చలు జరుపుకున్నాము.
జిల్లా ప్లీనరీలో స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రజలు చూస్తున్నారు. మహానాడు సభల్లో చంద్రబాబును పొగడటం ప్రతిపక్షాలను తిట్టడం, వంటకాల రుచులను గురించి తప్ప మరో అంశం చర్చించలేదు. మన పార్టీ మాత్రం వైఎస్ఆర్ ఆశయాల కోసం ప్రారంభించిన పార్టీ. ఒక ఎంపీ, ఎంఎల్ఏతో ప్రారంభమైన పార్టీ, రోజురోజుకు దినదినాభివృద్ధి సాధిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటాం. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఐదులక్షల మెజార్టీతో ఎంపీగా ఎన్నికై దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తే, సర్పంచిగా ఎన్నిక కాలేక దొడ్డిదారిని సభలోకి వచ్చి మంత్రి అయిన లోకేష్ తో పోలుస్తుండటం హాస్యాస్పదం. పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. కడప జిల్లా దివంగత వైయస్సార్ వెంట నడిచిన జిల్లా.
మా ప్రాంతానికి ఏమైనా మేలు జరిగిందంటే అది ఆయన హయాంలోనే జరిగింది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని పోరాడాం. వైయస్సార్ హయాంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడం జరిగింది. కాని తరువాత పక్కకు బెట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని ప్రతిపాదించాలని కోరుతున్నాము. మా జిల్లా వెనకబడిన జిల్లా, సాగునీరు, తాగు నీరు లేని జిల్లా. ఆ రోజు శంఖుస్తాపన చేశారు. సోమశిల జిల్లా ప్రాజెక్టు కింద 120 గ్రామాలు 20 వేల మంది నిర్వాసితులు రోడ్డున పడ్డారు' అని ఆయన తీర్మానంలో పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు