‘గీత’ దాటి మాట్లాడొద్దు!
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మండిపాటు
సాక్షి ప్రతినిధులు-కాకినాడ, విజయనగరం, పాడేరు : వైఎస్సార్ సీపీ టికెట్పై అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియకుండా సీఎం చంద్రబాబుతో సమావేశం కావటంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి, మంత్రులను కలిశానంటున్న గీత అధికార దాహంతోనే టీడీపీ పంచన చేరే ఏర్పాట్లలో ఉన్నారని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ఆమె చెప్పేదే నిజమైతే ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకూ గిరిజనులకు సంబంధించి ఎన్ని అంశాలపై స్పందించారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.
తూర్పుగోదావరి ఏజెన్సీ నుంచి శ్రీకాకుళం వరకు ఏ ఒక్కరికీ కనీసం ఆమె ముఖం కూడా తెలియకున్నా విద్యావంతురాలనే కారణంతో నమ్మి టికెట్టు ఇచ్చిన పార్టీని దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు రంపచోడవరం, పాడేరు తదితర చోట్ల విలేకరులతో మాట్లాడుతూ గీత తీరును తీవ్రంగా ఖండించారు. మోసం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి(రంపచోడవరం), అనంత ఉదయభాస్కర్(తూర్పుగోదావరి జిల్లా యువజన విభాగం కన్వీనర్) విమర్శించారు. చంద్రబాబుని గీత కలవడం తప్పేనని కురుపాంఎమ్మెల్యే పి.పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజనులే గుణపాఠం చెబుతారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దుయ్యబట్టారు.