మనకు వైఎస్ జగనే అండ

మనకు వైఎస్ జగనే అండ - Sakshi


 సాక్షి, ఏలూరు : ‘అధికార మదంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న అరాచకాలకు భయపడాల్సిన పనిలేదు. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలి.. సమస్యల్లో వెన్నుదన్నుగా నిలిచేదెవరు అనే సందేహాలకు తావులేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అంకన్నగూడెం ఘటన. అకారణంగా ఆ గ్రామంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, వారి ఇళ్లపైన దాడులు చేసి.. వారిని నేటికీ ఊరిలో అడుగుపెట్టలేనంతగా భయబ్రాంతులకు గురి చేశారు. ఆ రోజు విషయం తెలిసిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూడమన్నా రు.

 

 అవసరమైతే తానే స్వయంగా వచ్చి వారి తరఫున పోరాటం చేస్తానన్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలకు కొండంత ధైర్యాన్నిచ్చారు. దెందులూరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం సాయంత్రం పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ.. ‘అన్నదాతల అప్పులన్నీ తీర్చేస్తామని అసత్య హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేక జోలెపట్టి విరాళాలు అడుగుతూ రైతుల్ని బిచ్చగాళ్లగా చూడకండి. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి. డ్వా క్రా రుణాలన్నీ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు గ్రూపు లీడర్లనే మొత్తం రుణం కట్టమని డ్వాక్రా మహిళల్ని మోసం చేయకండి.

 

 ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం వస్తుంది’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించడానికి కేటాయిస్తున్న సమయాన్ని ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి వెచ్చించాలని జిల్లా మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌కు ఆళ్ల నాని సూచించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చంద్రబాబు కళ్లు తెరిపించండని వారికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల చొప్పున భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు యువతను మోసం చేశారన్నారు. త్వరలోనే గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ అన్ని కమిటీలు వేస్తామని, పార్టీ కోసం త్యాగాలు, ప్రజల కోసం పోరాటాలు చేసే వారికి కమిటీల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.

 

 అంత కండకావరమా : పార్టీ పరిశీలకులు బోస్

 ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తికి కండకావరం ఉండకూడదని, నాయకుడనేవాడు నోరులేని వారికి మాటలా, ఆపన్నులకు అండగా ఉండాలని.. టీడీపీ నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలని మాజీ మం త్రి, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీ లకులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ హితవు పలికారు. అక్రమ కేసులకు భయపడవద్దని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జీఎస్ రావు మాట్లాడుతూ రాష్టాన్ని  సింగపూర్ చేస్తానంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీకి డబ్బులు లేవంటూ చంద్రబాబు సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

 

 ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోనే ఖ్యాతినార్జించారని, ఆయన ఆశయాలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని అన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు మారని మనిషి అనే విషయూన్ని ఆ పార్టీ వారే గుర్తించారని చెప్పారు. బాధల్లో ఉన్న వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే ఓదార్చాలని పిలుపునిచ్చారు. పార్టీ దెందులూరు నియోజకవర్గ నేతలు కొఠారు రామచంద్రరావు, చలుమోలు అశోక్‌గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ చేయలేని పనులను ప్రజలకు మనం చేద్దామని, టీడీపీ వేధింపులను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. సమావేశానికి దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి, దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

 

 అధికారపక్షం బలహీనపడుతోంది : ధర్మాన

 అధికారంలోకి రాలేకపోయినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినట్టు కాదని మాజీ మంత్రి, పార్టీ ఉభయగోదావరి జిల్లాల సమస్వయకర్త ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఒక్క ఎమ్మెల్యేతో మొదలైన వైఎస్సార్ సీపీ ప్రస్థానం తర్వాత 18కి చేరిందని, గత ఎన్నికల్లో 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని బలాన్ని మరింతగా పెంచుకుందని వివరించారు. గడచిన వంద రోజుల్లో అధికార పార్టీ బలహీనపడుతుంటే ప్రతిపక్ష పార్టీ బలపడుతోందన్నారు. సంస్థాగత నిర్మాణ లోపం వల్లే ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని, 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలు ఏకపక్షంగా వైఎస్సార్ సీపీకి రావడం ఖాయమని అన్నారు. చంద్రబాబు రుణమాఫీ హామీని నెరవేర్చలేక రోజుకో సాకు చెబుతున్నారని, మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు, మహిళల పక్షాన తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం అన్యాయం చేసినా తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు అండగా ఉంటామని ధర్మాన అభయం ఇచ్చారు.

 



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top