బాబూ.. మభ్యపెట్టింది చాలు


హనుమాన్‌జంక్షన్ రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీపై  మభ్యపెట్టడం మానుకుని రైతులను ఆదుకునేందుకు  కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యవిభాగం రాష్ట్ర  అధ్యక్షుడు డాక్టరు దుట్టా రామచంద్రరావు  డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. రైతులు, డ్రాక్వా రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీపై కాలం గడుపుతున్నారని విమర్శించారు.ఎన్నికల సమయంలో రూ.1.05 లక్ష కోట్ల వ్యవసాయ రుణాలు రద్దుచేస్తానని చెప్పి నట్టేట ముంచారని చెప్పారు.   రైతు సాధికార సంస్థ కార్యాలయం ప్రారంభించి మరోమారు రైతులను మభ్యపెట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నాడని విమర్శించారు.

 

 ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటేకనీసం ముఖ్యమంత్రిగా అన్నమాట ప్రకారం ముందుగా 20శాతం రుణమాఫీకి మాత్రమే రూ.5వేల కోట్ల మూలనిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే ప్రకటించిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, బందరు పోర్టు, ఆరులైన్ల జాతీయ రహదారి తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఏడు వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని వాటికి మార్కెట్ ధర  చెల్లించి రైతులను  ఆదుకోవాలని సూచించారు.

 

 పార్టీలకతీతంగా పరిపాలన అందించాలి..

 పార్టీల కతీతంగా అర్హులైన వారందరికీ  సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని దుట్టా డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసి అర్హులైన వారివి, వైఎస్సార్ సీపీకి చెందిన వారిని పక్కన పెట్టడం  దారుణమన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ఎంపిక చేసిన ఎస్సీ, ఎస్టీ రుణాల లబ్ధిదారుల జాబితాను రద్దు  చేయడం దుర్మార్గమయిన చర్య అని డాక్టర్ దుట్టా దుయ్యబట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top