వైసీపీ సారథి ఆళ్ల నాని

వైసీపీ సారథి ఆళ్ల నాని - Sakshi


సాక్షి, ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)ని నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. గడచిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తెల్లం బాలరాజు పార్టీ జిల్లా  కన్వీనర్ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేథ్యంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా నాని నియమితులయ్యారు.

 

 వైఎస్ శిష్యుడు

 విద్యార్థి దశనుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమానిగా ఉన్న ఆళ్ల నాని ఆయన ఆశీస్సుల తోనే 1993లో రాజకీయ రంగప్రవేశం చేశా రు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. 1994లో ఏలూ రు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో 32 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. 2009 ఎన్నికల్లోనూ ముక్కోణపు పోటీలో విజయం సాధించి రికార్డు సృష్టించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందారు. తన రాజకీయ గురువుగా వైఎస్ పేరును ప్రతి సందర్భంలోనూ నాని చెబుతుంటారు.

 

 అహర్నిశలూ పార్టీ కోసమే

 పార్టీ పిలుపునందుకుని ప్రతి కార్యక్రమాన్ని ఆళ్ల నాని విజయవంతంగా నిర్వహించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాన్ని పూర్తి చేరయించడం కోసం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గతంలో నాని చేసిన ఆందోళన అప్పట్లో సంచలనం కలిగించింది. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఏటిగట్ల పటిష్టం కోసం నీటిపారుదల శాఖ ఎస్‌ఈ కార్యాల యాన్ని ముట్టడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ ఏలూరులో రాష్ట్రస్థాయిలో ఫీజు దీక్ష చేసినప్పుడు ఆమెను వెన్నంటి ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు నాని నేతృత్వం వహించి పార్టీ అధినేత ఓదార్పు యాత్రను ఏలూరు నుంచే శ్రీకారం చుట్టేలా కృషిచేశారు. షర్మిల నిర్వహించిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో అడుగుకలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో నాని అలుపెరగని పోరాటం చేశారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజల్లో సమైక్య దీప్తి రగిలించారు. నగరం మొత్తం పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు.

 

 అభివృద్ధి ప్రదాత

 నగరంలో ఐదు కాలనీల్లో 10వేల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి సొంతగూడు కల్పించారు. ఏటా వర్షాకాలంలో నగర ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న తమ్మిలేరు వరదల నుంచి కాపాడేందుకు రూ.17.50 కోట్లతో ఏటిగట్ల పటిష్టం కోసం రివిట్‌మెంట్లు నిర్మించారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు, సురక్షితమైన గోదావరి నీటిని అందించేందుకు భారీ మంచినీటి పథకాన్ని నగరానికి అందించిన ఘనత ఆయనదే. వేసవిలో ఒకపూటే తాగునీటికి నోచుకునే నగరవాసులకు ఈ పథకం ద్వారా రెండు పూటలా శుద్ధిచేసిన తాగునీరు అందుతోంది.

 

 గన్‌బజార్ రైల్వే లెవెల్ క్రాసింగ్‌పై రూ.18 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మించి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించారు. ఏలూరు పురపాలక సంఘానికి నగరపాలక సంస్థగా వర్గోన్నతి సాధించారు. నగరంలో రూ.4 కోట్లతో మూడు వంతెనలు నిర్మించి జనం ఇబ్బందులు తొలగించారు. ప్రభుత్వ జూని యర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయిం చారు. రూ.3.50 కోట్లతో మూడు మార్కెట్లను ఆధునికీకరించారు. గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు పదుల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు. సుమారు 200 మంది హమాలీలకు సొంతింటి కల నెరవేర్చారు. రూ.17.50 కోట్లతో నగరంలో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చారు.

 

 నాని ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆళ్ల నాని జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తారని పలువురు నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నానిని పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమించడంపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఏలూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో నాని చేసిన కృషి నగర ప్రజలందరికీ తెలిసిన విషయమేనని పలువురు పేర్కొన్నారు. సామాన్య ప్రజల సమస్యలపై ఆయన స్పందించే తీరు ఇతర నాయకులకు ఆదర్శమన్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 అన్ని వర్గాలనూ కలుపుకుపోయే వ్యక్తిగా జిల్లాలోని అన్నిరంగాల  ప్రముఖుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని వైఎస్సార్ సీపీ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నాని నాయకత్వంలో పని చేయడానికి మరింత మంది యువకులు ముందుకువస్తారని, అలాగే వివిధ పార్టీల నాయకులను కూడా తమ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు నాని రాజకీయ చతురత పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆళ్ల నాని జిల్లా అధ్యక్షులుగా నియమితులు కావడంపై పార్టీ  ఏలూరు నియోజకవర్గ నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు, మున్నుల జాన్‌గురునాథ్, గంపల బ్రహ్మావతి, నెరుసు చిరంజీవులు, కడవకొల్లు సాంబ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

 

 ప్రజలపక్షాన నిరంతర పోరు

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే ప్రధాన అజెండాగా పార్టీని నడిపించడమే నా లక్ష్యం. నా గరువు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు నేర్పింది కూడా అదే. అందరి సహకారంలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసి ముందుకు నడిపిస్తాను.

 - ఆళ్ల నాని, జిల్లా అధ్యక్షుడు,

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top