చంద్రబాబు అమెరికా పర్యటన: ‘పచ్చ’ విషం..
డల్లాస్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ‘పచ్చ’ మీడియా మరోసారి విషం చిమ్మింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్ సీపీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆ పార్టీ యూఎస్ విభాగం తీవ్రంగా ఖండించింది. పచ్చ మీడియా చేస్తున్న నిరాధార ఆరోపణలను వైఎస్ఆర్సీపీ అమెరికా విభాగం కన్వీనర్లు రత్నాకర్ పండుగాయల, గురవారెడ్డి తోసిపుచ్చారు. చంద్రబాబు అమెరికా పర్యటనపై ఇర్వింగ్ పోలీసులకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వారు స్పష్టం చేశారు.
అమెరికాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా డల్లాస్లో తాము ఆందోళనలు చేపట్టినట్టు టీడీపీ అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేయడంతో పాటు వెబ్సైట్ కథనాలపైనా రత్నాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అమెరికా విభాగం తరపున తాము ఎక్కడా ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టలేదని, తాము ఫిర్యాదు కూడా చేయలేదని తేల్చిచెప్పారు. అమెరికాలో చంద్రబాబు పర్యటన విజయవంతం కాలేదన్న అక్కసుతోనే... కావాలని వైఎస్ఆర్సీపీపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే పచ్చ మీడియా తన ఆరోపణలు నిరూపించాలని రత్నాకర్ సవాల్ చేశారు.
పార్టీ చందాలు, నిధుల సేకరణ విషయంలో స్థానికంగా ఇక్కడ టీడీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన విబేధాలు బయటకు రాకుండా ఉండేందుకు వైఎస్ఆర్సీపీపై బురదచల్లే ప్రయత్నం జరిగిందన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు తాము ఎలాంటి ఫిర్యాదులు కానీ, ఈ-మెయిల్స్ కూడా చేయలేదని రత్నాకర్ స్పష్టం చేశారు. టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలను చూసి తాము ఆశ్చర్యపోయినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి నిరాధార వార్తలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదని, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.