టీడీపీ అకృత్యాలపై పోరాడుదాం


* వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని  

* తాళ్లపూడి, కొవ్వూరులో పార్టీ మండల సమావేశాలు


తాళ్లపూడి : చంద్రబాబునాయుడు ప్రభుత్వం మోసాలు, అకృత్యాలపై ప్రజల తరుఫున పోరాటానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (నాని) అన్నారు. తాళ్లపూడిలో గురువారం నిర్వహించిన పార్టీ మండల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మొండివైఖరి, అబద్దాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు, డ్వాక్రా రుణాల మాఫీలను వెంటనే అమలుచేయాలని కోరుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 5న తలపెట్టిన ధర్నాను విజయవంతంచేయాలని కోరారు.



గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. తాను ముందుండి నడిపిస్తానని, ఎవరూ నిరాశ చెందవద్దన్నారు. త్వరలో గ్రామస్థాయిలో కార్యకర్తలను కలుసుకుంటానని అన్నారు. పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అబద్దాలతో అధికారంలోకి వచ్చాడన్నారు. అయితే ప్రజలకు నిజం తెలిసిందన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నాయకుల అరాచకాలను అడ్డుకోవాలని అన్నారు.



రాష్ట్రంలో పాలన సక్రమంగా లేదని, రైతులు, డ్వాక్రామహిళలు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రామతిరుపతిరెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఎ.దొరయ్య, పార్టీ మండల కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా కన్వీనర్ వందనపు సాయిబాల పద్మ, ముప్పిడి సంపత్‌కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ బండి అబ్బులు, ఎంపీటీసీ సభ్యులు పి.కటాక్షం, శీలబోయిన కృష్ణ, గూడా విజయరాజు, కుంటముక్కల రాంబాబు, కరిబండి గనిరాజు  పాల్గొన్నారు.

 

న్యాయంచేయాలని మత్స్యకారుల వినతి : గోదావరిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలతో జీవనోపాధి కష్టంగా మారిందని తాళ్లపూడి మత్స్యకారులు మల్లాడి పోశియ్య, మల్లాడి లక్ష్మణస్వామి ఆళ్ల నానికి మొరపెట్టుకున్నారు. అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.  

 

పార్టీకి అండగా నిలిచిన వారిని కాపాడుకుంటాం

ధర్మవరం (కొవ్వూరు రూరల్ ) : చంద్రబాబు మాయమాటలతో మోసపోయిన ప్రజలకు అండగా నిలిచి పోరాడదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. ధర్మవరంలో మండల కన్వీనర్ ముళ్లపూడి కాశీ విశ్వనాథ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాని ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీకి అండగా నిలిచిన ప్రజలను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని మ్యాన్‌ఫెస్టో తయారుచేసిన చంద్రబాబు కన్నా, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మోసపు వాగ్దానాలను చెప్పి ప్రజలను నమ్మించిన టీడీపీ కార్యకర్తలు అసలైన మోసగాళ్లని దుయ్యబట్టారు.



పార్టీ సీజీసీ సభ్యులు జీఎస్‌రావు మాట్లాడుతూ సింగపూర్, జపాన్ వంటి నగరాలను నిర్మిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట్లాడడంలేదని ఎద్దేవా చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల వాగ్దానాలను మరచి రైతులను, మహిళలను మోసం చేసిందన్నారు. పార్టీ నాయకులు పీకె రంగారావు, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఆత్కూరి దొరయ్య, రాష్ట్ర ఎస్‌సీసెల్ నాయకులు ముప్పిడి విజయరావు, జిల్లాకమిటీ సభ్యులు బండి పట్టాభిరామారావు,  జిల్లా అధికార ప్రతినిధులు పోలినాటి బాబ్జి, ముప్పిడి సంపత్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిమి హరిచరణ్, జిల్లాకమిటీ సభ్యులు వర్రే శ్రీనివాసరావు, యండపల్లి రమేష్, ఉప్పులూరి రాజేంద్ర, ఎంపీటీసీలు ముళ్లపూడి వెంకట్రావు, ఎనికే వీర్రాజు, నాయకులు సుంకర సత్యన్నారాయణ, ఉప్పులూరి సూరిబాబు, చౌటుపల్లి వీరన్న, ఆరుగొలను చినరాజు, ఇంటి వీర్రాజు, బి.సురేష్, కొయ్యే మునియ్య, వేములపల్లి రాములు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top