వర్మా.. నీ గతం, స్థాయి మరువకు
గుమస్తాగిరీ చేసి కోట్లు ఎలా సంపాదించావ్?
వైఎస్, జగన్లను విమర్శించే అర్హత నీకు లేదు
వైఎస్సార్ సీపీ కన్వీనర్ దొరబాబు హితవు
పిఠాపురం : అయిదు వందల రూపాయల జీతానికి గుమస్తాగిరీ చేసి.. అడ్డదారుల్లో కోట్లు గడిం చిన ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే అర్హత లేదని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ పెండెం దొరబాబు అన్నారు. అన్నవరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే వర్మ విమర్శలు చేయడాన్ని దొరబాబు మంగళవారం ఒక ప్రకటనలో ఖండిం చారు. వైఎస్సార్, జగన్ల పేరు ఉచ్ఛరించడానికే అర్హత లేని వర్మ తన స్థాయిని మరచి టీడీపీ నేతల మెప్పు కోసం నోటికొచ్చినట్టు విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
తప్పుడు విమర్శలకు వర్మ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుమస్తాగా పనిచేసిన ఆయన కోట్లకు అధిపతి ఎలా అయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ జెండాలు తగులబెట్టించిన వర్మ మొసలి కన్నీరు కార్చితే ప్రజలు దయతలచి గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ప్రజలనే మోసగించి మళ్లీ అదే పార్టీ పంచన చేరి ఆ నేతలకు భజన చేస్తున్న వర్మ ఎప్పటికైనా ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదని అన్నారు.