రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి

రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి - Sakshi


వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్షం డిమాండ్

 

 సాక్షి, హైదరాబాద్: రైతాంగానికి ఎనలేని ప్రయోజనాలు కల్పించి అన్నదాతను రారాజును చేసిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8ని రైతు దినోత్సవంగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం డిమాండ్ చేసింది. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు మాట్లాడారు. విత్తన కంపెనీల దోపిడీ నుంచి రైతులను విముక్తులను చేశారన్నారు. పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవడానికి మోన్‌శాంటో లాంటి బహుళ జాతి కంపెనీ మెడలు వంచి రైతుల పక్షాన నిలిచిన రైతు పక్షపాతి వైఎస్ అని చెప్పారు. అలాంటి వైఎస్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ సభ్యుల మానసిక స్థితి సరిగా లేదేమోనని అనుమానం వ్యక్తంచేశారు. కేంద్రం ప్రకటించిన రుణ మాఫీ ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ లబ్ధి చేకూర్చి, రుణాలు కట్టిన రైతులకు రాష్ట్రం భరించేలా రూ.2 వేల కోట్లు అందించిన వైఎస్‌తో చంద్రబాబును ఏ కోణంలోనూ పోల్చలేమని గడికోట అన్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీపై రోజుకో మాట, పూటకో నిబంధన పెడుతూ రైతాంగాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనపై టీడీపీ నేతలు ఎందుకు నోరెత్తరని ప్రశ్నించారు.


మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్, షర్మిల, వైఎస్ భారతమ్మ,విజయమ్మ, భారతీరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు


 




 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నివాళి




 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ముందు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యేలందరూ పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు. ‘వైఎస్సార్ అమర్ హై’, ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ అక్కడినుంచి వాహనాల్లో బయలుదేరి పంజాగుట్ట వద్ద గల వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు పేద, బడుగు వర్గాల ప్రజలకోసం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్‌దేనని కొనియాడారు. ఆయన లేని లోటు ఇపుడు తెలుగు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

 

 అసెంబ్లీ సెంట్రల్‌హాలులో..

 

 పంజాగుట్ట నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యేలు సెంట్రల్ హాలులోని వైఎస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్ అమర్‌హై అంటూ నినాదాలు చేశారు. అక్కడినుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, ఆదిమూలం సురేష్, కిడారు సర్వేశ్వరరావు, మణిగాంధీ, కళత్తూరు నారాయణస్వామి, బూడి ముత్యాలనాయుడు, వరుపుల సుబ్బారావు, పాలపర్తి డేవిడ్‌రాజు, షేక్ బేపారి అంజాద్‌బాషా, పి.అనిల్‌కుమార్‌యాదవ్, తిరువీధి జయరామయ్య, మేకా ప్రతాప అప్పారావు, కొరుముట్ల శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, షేక్ ముస్తఫా, కొడాలి నాని, గొట్టిపాటి రవికుమార్, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, విశ్వాసరాయి కళావతి, గిడ్డి ఈశ్వరి, ఐజయ్య, వంతెల రాజేశ్వరి, ఆర్.కె.రోజా, సి.ఆదినారాయణరెడ్డి, కంబాల జోగులు, కలమట వెంకటరమణ, కొక్కిలిగడ్డ రక్షణనిధి, రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వై.బాలనాగిరెడ్డి,  పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, సి.నారాయణరెడ్డి, మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

 

 

 వైఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: రఘువీరా

 

 ఇందిరా భవన్‌లో నివాళులు

 ఓటమి ఎరుగని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి కొనియాడారు. వైఎస్ ఐదో వర్ధంతి సందర్భంగా మంగళవారం ఇక్కడి ఇందిర భవన్‌లో కాంగ్రెస్ నేతలు వైఎస్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన లేనిలోటు స్పష్టంగా కన్పిస్తోందని రఘువీరా అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామి గా నిలిచేలా వైఎస్ కృషి చేశారన్నారు. కార్యక్రమం లో మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, కాసు వెంకటకృష్ణారెడ్డి, కొండ్రు మురళి,  ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు, ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, కార్యదర్శి కె.రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు.




 పంజాగుట్ట సర్కిల్ వద్ద..




 దివంగత సీఎం వైఎస్ వర్ధంతి సందర్భంగా పంజాగుట్ట సర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ, ఏపీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్యయ్య, రఘువీరారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ తదితరులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.

 

 బడుగుల మనసెరిగిన నేత వైఎస్

 

 వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పలువురి నివాళి




 పేద, బడుగు, బలహీన వర్గాల మనసెరిగిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, అందుకే ఆయన దేశంలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ వర్గాల ప్రజల సంక్షేమం కోసం విప్లవాత్మకమైన పథకాలు అమలు చేశారని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ అవిభక్త రాష్ట్రంలో ఆయన అమలు చేసిన పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని శ్లాఘించారు. ఇప్పటికీ వైఎస్ లేనిలోటు కనిపిస్తూనే ఉందన్నారు. పరిపాలనంటే ఎలా ఉండాలో చేసి చూపిన వ్యక్తి వైఎస్ అని పీఏసీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ కొనియాడారు.

 

 సంతృప్తస్థాయి విప్లవాత్మకం

 

 వైఎస్ సీఎంగా ఉన్నపుడు కుల, మత, ప్రాంత, రాజకీయాలకతీతంగా ‘సాచ్యురేషన్’ (సంతృప్తస్థాయి) విధానాన్ని సంక్షేమ పథకాల్లో అమలు చేయడమనేది విప్లవాత్మకమని పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నిరుపేదలకు సైతం ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత వైఎస్‌దేనని సీజీసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్, విజయసాయిరెడ్డి, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాశ్ తదితరులు మాట్లాడారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరంలో కొణతాల రామకృష్ణ, విజయసాయిరెడ్డితో సహా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు. అనాథ విద్యార్థులకు ఆర్థిక సాయం, పుస్తకాల పంపిణీ ఈ సందర్భంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో వాసిరెడ్డి పద్మ, రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, పుత్తా ప్రతాపరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top