‘అన్న వస్తున్నాడు’ జనాల్లో పాతుకుపోయింది
కన్సల్టెన్సీ విధానాల సంస్కృతి టీడీపీదే: గడికోట
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ప్లీనరీలో ‘అన్న వస్తున్నాడు’ చెప్పండి అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన మాట ప్రజల గుండెల్లో పాతుకుపోయిందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన లోటస్పాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్లీనరీలో ప్రజలకు భరోసా కల్పిస్తూ జగన్ ఇచ్చిన హామీలపై టీడీపీ ఉలికిపడుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు పాద యాత్ర చేసి 600 వాగ్దానాలతో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్ర బాబులా జగన్ అబద్ధాలు చెప్పి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికలకు కన్సల్టెం ట్లను పెట్టుకుందని విమర్శిస్తున్నారని, ప్రభుత్వంలోని అన్ని శాఖలను కన్సల్టెంట్లకు అప్పగించింది బాబు ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వారికి నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడన్నారు. ‘చంద్రబాబు మోస పూరిత హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు.
అవినీతి, అక్రమాలు, భూదందాలతో మూడేళ్లు గడిచిపోయాయి. మోసాలు, అక్రమాలకు పాల్పడ్డ బాబు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు ఒక్కో ఓటుకు రూ. 5 వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. అధికార పార్టీ అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టికి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.