కేసీఆర్.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి

కేసీఆర్.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి - Sakshi


ఏపీ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించటం సరికాదు: వై.ఎస్.జగన్

 

 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెరిగేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో కలసి వై.ఎస్.జగన్ మంగళవారం సాయంత్రం ఆర్థికమంత్రి జైట్లీని ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆయన కార్యాలయంలో కలిశారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించేందుకు వీలుగా భారీగా నిధులు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమలుచే సి రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించిన 8 పేజీల వినతిపత్రాన్ని జైట్లీకి కూడా అందించారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నిన్న (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చెప్పిన అంశాలను అరుణ్‌జైట్లీకి కూడా నివేదించాం. రాష్ట్రానికి మంచి చేయాలని కోరాం. ఆయన సానుకూలంగా విన్నారు. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం...’’ అని పేర్కొన్నారు.

 

 రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారు...

 ‘పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నిధుల దుర్వినియోగంపై ఏమైనా చెప్పారా?’ అని మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘పట్టిసీమ గురించి ఆర్థికమంత్రికి కూడా చెప్పాం. 21.9 శాతం ఎక్సెస్‌కు కోట్ చేయడం, టెండర్లు వేసిన తరువాత ఎక్సెస్‌ను బోనస్‌గా మార్చడం, టెండరు పిలవకముందు బోనస్ అనే క్లాజ్ లేకపోవడం, కోట్ చేసిన తరువాత ఎక్సెస్‌లో 16.9 శాతం బోనస్‌గా ప్రకటించడం వంటి అంశాలన్నీ తెలియజేశాం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని నిబంధనలు ఏవిధంగా ప్రభావితం చేయనున్నాయో వివరించాం...’’ అని పేర్కొన్నారు. ‘గోదావరి ప్రజలు పట్టిసీమ వద్దని అంటున్నారు.

 

 వారిని కూడగడతారా?’ అని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘‘మేం పట్టిసీమపై మొదటి నుంచీ స్పష్టంగా ఉన్నాం. జరుగుతున్నది అన్యాయం. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగానే.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఇ) క్లాజ్ ప్రకారం 35 టీఎంసీల నీళ్లు వెళ్లిపోతాయి. ఇప్పుడు పట్టిసీమ పనులు మొదలుపెట్టగానే 7(ఎఫ్) క్లాజ్ వల్ల మరో 35 టీఎంసీలు వెళ్లిపోతాయేమోనన్న భయం మాలో చాలా ఎక్కువగా ఉంది. ప్రాజెక్టులు మొదలుపెట్టగానే.. కృష్ణాకు వచ్చే 70 టీఎంసీల నీళ్లు దూరమవుతాయేమోనన్న భయం ఉంది. ఎటువంటి స్టోరేజీ కెపాసిటీ నిర్మాణం లేకుండా కేవలం డబ్బులు సంపాదించుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో ఈమాదిరిగా రాష్ట్రాన్ని పణంగా పెట్టడం తప్పు అని స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి దీనిని ప్రతి వేదికపైనా కచ్చితంగా వ్యతిరేకిస్తాం...’’ అని బదులిచ్చారు.

 

 కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి...

 

 తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వాహనాలపై పన్ను విధించడాన్ని ఎలా చూస్తారని ఇంకో విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా ‘‘పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు చేయనప్పుడు.. ఒకే భాష మాట్లాడుకుంటున్న మనం చేయడమన్నది సరికాదని మేం మొదటి నుంచీ చెప్తున్నాం. ఒకే భాష మాట్లాడుతాం. మనుషులమంతా కలిసే ఉంటాం. మనం మనం పెరగాలనే చూడాలి తప్ప.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే కరెక్టు.. కేసీఆర్ కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకుని ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంచాలి...’’ అని జగన్ స్పందించారు.

 

 జైట్లీకి వినతిపత్రం సారాంశమిదీ...

 

 ూ విభజన తర్వాత ఏపీకి ఐదేళ్ల పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తామన్న నాటి ప్రధాని హామీని సత్వరం నెరవేర్చాలి.

 

 ఇచ్చిన హామీ మేరకు ఏపీ వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయాలి.

 ూ ప్రకాశం జిల్లా వంటి తక్కువ తలసరి ఆదాయమున్న ఇతర జిల్లాలకూ ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలి.

 

 పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాలి. ఆచరణ సాధ్యం కాని పట్టిసీమ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి.

 

 రాష్ట్ర రాజధాని నిర్మాణానికి డీగ్రేడెడ్ అటవీ భూములను డీనోటిఫై చేస్తానని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల డీగ్రేడెడ్ అటవీ భూములు ఉన్నా.. బహుళ పంటలు సాగయ్యే 30 వేల ఎకరాలను భూములను భూ సమీకరణ పేరుతో సేకరించటాన్ని రైతులతో పాటు, ప్రతిపక్షంగా మేమూ వ్యతిరేకిస్తున్నాం.

 

  కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం 2015-16 బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర రాజధాని కోసం భారీ మొత్తంలో నిధులు కేటాయించాలి.

 

  హిమాచల్‌ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్‌కూ ప్రకటించాలి.

 

 పన్ను ప్రోత్సాహకాలను మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ప్రకటించాలి.

 

 కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖల్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ, విజయవాడ మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, చిత్తూరు జిల్లాలో ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్ మన్నవరం ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలి.

 

 రెండు రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాల్సిన విద్యాసంస్థలు, వైద్య సంస్థలకు ఇతోధికంగా నిధులు కేటాయించి సత్వర నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

 

 సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, తదితర రైల్వే రంగ హామీలన్నీ నెరవేర్చాలి.

 ూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ త్వరగా నెరవేర్చాలి. ప్రాణహిత - చేవెళ్ల, దుమ్మగూడెం - నాగార్జునసాగర్ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలి.

 

 తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.

 

 జగ్గంపేట, విశాఖకు నేడు జగన్

 

 వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటకు ఆయన వెళతారు. అక్కడ ఆయన వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ సోదరుడి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. నెహ్రూ సోదరుడు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. అక్కడ పరామర్శించిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నానికి బయల్దేరి వెళతారు. గోకులపాడులో జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబీకులను జగన్ ఓదారుస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top