చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ

చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి  బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలు రద్దు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.



లేఖ సారాంశం ఈ దిగువ ఇస్తున్నాం.



జూన్ రెండో వారం అయినా రైతులకు కొత్త రుణాలు అందడం లేదు. ఏ బ్యాంక్ నుంచి అయినా రైతు ఒక్క రూపాయి రుణంగా తెచ్చుకునే వాతావరణం లేదు. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీపైనే తొలి సంతకం చేస్తానన్న  మీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంట రుణాలు, బంగారం రుణాలతో పాటు వ్యవసాయ రుణాలకు సంబంధించి ఇచ్చిన మాటను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మాఫీ చేయండి.



రైతుకు, రైతాంగానికి, వ్యవసాయానికి, పల్లెలకు, ఆహారభద్రతకు ఎలాంటి అన్యాయం జరగకుండా మీరు వాగ్దానం చేసిన విధంగా రుణమాఫీ చేయండి. రుణ మాఫీ చేసిన రోజు నుంచి రైతులకు కొత్త రుణాలు పొందే అవకాశం కల్పించాలి.  సీఎంగా మీరు ఈ పనిచేయడానికి విధివిధానాలతో పనేంటి? వ్యవసాయరుణాలు, బంగారం రుణాలు ఎన్ని ఉన్నాయో, డ్వాక్రా , చేనేత రుణాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. కమిటీలు, 45 రోజుల గడువు వంటి అంశాలు ఆ రోజు మీరు చేసిన వాగ్దానంలోగాని, టిడిపి మేనిఫెస్టోలో గానీ లేవు.



పుస్తెల తాళ్లు, దస్తావేజులు వెనక్కు వస్తాయంటూ టీవీల్లో యాడ్స్‌ ఇచ్చిన మీరు నేడు రైతులను నిరాశ, నిస్పృహలోకి నేట్టివేసి కాలయాపన కమిటీలను నియమించడం సరికాదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top