విశాఖకు చంద్రబాబు ఏం చేశారు: వైఎస్‌ జగన్‌






విశాఖపట్నం: అన్యాయాన్ని ఎత్తిచూపేందుకే మహాధర్నా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ధర్నాతోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి రావాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు రెవెన్యూ అధికారులు కలిసి మాఫియాగా మారారని ధ్వజమెత్తారు. భూములను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

విశాఖపట్నంలో చోటుచేసుకున్న పెద్ద మొత్తం భూకుంభకోణంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గురువారం ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇసుకవేస్తే రాలనంత స్థాయిలో జనాలు తమ గోడును వినిపించుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ముదపాకలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భారీగా అసైన్డ్‌ భూములను కొట్టేసే ప్లాన్‌ చేశారని చెప్పారు. 

 

అందులో భాగంగానే లక్ష ఆరు వేల ఎకరాల సర్వే నెంబర్లు కనిపించడం లేదని కలెక్టర్‌ కొత్త కథ చెబుతున్నారని, హుదుద్‌లో రికార్డులు పోయాయని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఈ విషయం గుర్తొచ్చిందా అని నిలదీశారు. 16,375 ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ పుస్తకాలు కనిపించడం లేదని కలెక్టర్‌ అంటున్నారని, అంటే లక్ష ఆరువేల ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లు కనిపించలేదని, హుద్‌హుద్‌ వచ్చినప్పుడు పోయాయని అంటున్నారని, మూడేళ్ల తర్వాత ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.



హుదుద్‌లో కలెక్టర్‌ భవనాలు ఎగిరిపోలేదని, సునామీలాగా నీరు రాలేదని, తాను 11 రోజులు ఇక్కడే ఉండి అన్ని ప్రాంతాలు తిరిగినట్లు గుర్తు చేశారు. హుదుద్‌లో వచ్చింది గాలి వాన మాత్రమే అని చెప్పారు. రెవెన్యూ రికార్డులు ఎలా అంటే మార్చుకునేందుకే ఈ కట్టుకథలన్నీ కలెక్టర్‌ చెబుతున్నారని, దాదాపు 23 వేల ఎకరాలు కబ్జా అయ్యాయని ప్రభుత్వ లెక్కలే చెబుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఒక్క అంగుళం భూమిని కూడా పోనివ్వమని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

 

దగ్గరుండి కబ్జా చేయించారు

జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరరావు దగ్గరుండి భూములన్నింటినీ కబ్జా చేయించారని, ఆయన బంధువు భాస్కరరావు తనకు సంబంధం లేని భూములను తన పేరిట రిజిస్టర్‌ చేసుకొని పేదల కాలనీలో భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి లోన్లు తీసుకున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రభుత్వాధికారులే సహకరిస్తున్నారని ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. గంటకు ఇంత నారా లోకేశ్‌కు ఇంత అని డబ్బులు పంచుకుంటున్నారని ధ్వజమెత్తారు.



గంట సాక్షాత్తు ఒక మంత్రి అని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖలో భూదందా జరుగుతోందని ముందునుంచే చెప్పారని, అలాగే, శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ భూములు కబ్జా చేస్తుంటే కాపాడుకునే పరిస్థితి లేకుండా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కలెక్టరే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో కుమ్మక్కై లోకేశ్‌తో చేతులు కలిపి అందరు కలసి భూదందాలు చేస్తుంటే సామాన్యుడు ఎక్కడికి వెళ్లాలని మండిపడ్డారు. నేడు ధర్నా జరుగుతుందని, తాను వస్తున్నానని, కంప్యూటర్లలో కొన్ని భూములు లెక్కలు సరి చేశారని చెప్పిన వైఎస్‌ జగన్‌ తాను వస్తే ఒక బటన్‌ రాకుంటే మరో కంప్యూటర్‌ బటన్‌ నొక్కుతున్నారని దుయ్యబట్టారు.




ఎంవీవీఎస్‌ మూర్తి చంద్రబాబుకు బంధువు

‘గీతం కాలేజీల యజమాని ఎంవీవీఎస్‌ మూర్తి చంద్రబాబుకు బంధువు. రిషీ కొండలో 55 ఎకరాలు కబ్జా చేశారు. అవి ప్రభుత్వ భూములు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల కోసం ఉంచిన భూములు. వాటిని కబ్జా చేసి తనకు ఇవ్వాలని చంద్రబాబును కోరగానే వెంటనే కేబినెట్‌ ద్వారా అర్పించేశారు. ఆ భూములు విలువ వెయ్యికోట్లు. అలాగే, రాజీవ్‌ స్వగృహ కోసం మహానేత వైఎస్‌ 7 ఎకరాలు ఇస్తే వాటిని కబ్జా చేశారు. ఆ భూముల విలువ రూ.100 కోట్లు. గతంలో ఉన్న కలెక్టర్‌ భూములు కబ్జా అవుతున్నాయని చెబుతున్నా సొంత బంధువులకు చంద్రబాబు వేలకోట్లు ధారా దత్తం చేస్తున్నారంటే విశాఖలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు’ అని వైఎస్‌జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

 

గంటానే బినామీలతో కొనుగోలు చేయించారు

విశాఖ శివారుల్లో భీమిలీ నియోజకవర్గంలో 358 ఎకరాల అసైన్డ్‌ భూములు గంటా బినామీలతో కొనుగోలు చేయించి పూలింగ్‌ పేరిట జీవోలు ఇప్పించారని, ఆ భూములు కొనడం నేరం అని తెలిసినా కొనొచ్చని లోకేశ్‌ ద్వారా జీవోలు ఇప్పించారని మండిపడ్డారు. మదుపాకలో 950 ఎకరాలు బండారు సత్యనారాయణ దగ్గరుండి తక్కువ ధరకు కొనుగోలుచేసి కోట్లకు అమ్ముకునే కార్యక్రమం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్‌పల్లా భూములు వివాదంలో ఉన్నాయని, అందులో టీడీపీ ఆఫీసు కట్టిస్తున్నారంటే వాటిని కబ్జా చేశారా? చంద్రబాబు నాయుడు అని నిలదీశారు. విశాఖ మీద ప్రేమ ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఎయిర్‌పోర్ట్‌ తొలగించి భోగాపురంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ తెస్తారని చంద్రబాబు చెబుతున్నారని, కానీ, ఆ ఎయిర్‌పోర్ట్‌ వచ్చేది మాత్రం టీడీపీ నేతల భూములు ఉన్నచోటేనని చెప్పారు.

 

పేదలంతా వణికిపోతున్నారు..

చంద్రబాబు హయాంలో కేబినెట్‌ మీటింగ్‌ జరిగితే అసైన్డ్‌ భూములు ఉన్న పేదలంతా వణికిపోతున్నారని వైఎస్‌ జగన్‌ అన్నారు. పేదవాడిని దోచేసుకో... పెద్దవాళ్లతో కుమ్మక్కవ్వు అన్నదే చంద్రబాబు సిద్ధాంతమని అన్నారు. చంద్రబాబుకు, ఆయన పార్టీకి విశాఖ జిల్లా చాలా చేసిందని.... అలాంటి విశాఖకు చంద్రబాబు ఏం చేశారని జగన్‌ నిలదీశారు.

 

సీబీఐ అయితే తన్ని లోపల వేస్తుంది

విశాఖపట్నం జిల్లాలో ఏవైనా పేదవాడి భూములు ఉన్నాయంటే ఆ భూములపై పెద్దవాడి కన్నుపడుతుందని, పేదలంతా వణికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తొలుత బహిరంగ విచారణ అన్నారు.. వేలమంది వస్తారేమోనని భయపడి.. సిట్‌ తో చేస్తారంట. సిట్‌లో ఉన్న అధికారులంతా చంద్రబాబు కింద పనిచేసేవారు. చేసింది నువ్వు.. నీ కొడుకు.. నీమంత్రులు, నీ రెవెన్యూ అధికారులు అయినప్పుడు సిట్‌ రిపోర్టు ఏమొస్తుంది.

 

సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడం సరేనా అని రావణుడు కుంభకర్ణుడితో దర్యాప్తు చేయిస్తే ఏం లాభం హనుమంతుడితో వేయిస్తే గానీ తన్ని లోపల వేస్తాడు. అలాగే, సీబీఐ దర్యాప్తు వేస్తే చంద్రబాబును, లోకేష్‌ను, మంత్రులు, అధికారులను తన్ని లోపల వేస్తారు’ అని వైఎస్‌ జగన్‌ చురకలు అంటించారు. సీబీఐ విచారణకు 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అంటున్నారని, ఆలస్యం అవుతందని వేయడం లేదా లేక 20 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని వేయడం లేదా చెప్పాలని డిమాండ్‌ చేశారు. 


ప్రతి అంగుళం తిరిగి ఇస్తాను

చంద్రబాబు కేబినెట్‌ సమావేశం పెడితే పేదవాళ్లను దోచుకో పెద్ద వాళ్లతో కుమ్మక్కుకా అని మంత్రులతో చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘విశాఖపట్నం మీ పార్టీకి చాలా చేసింది. మీరు విశాఖపట్నానికి ఏం చేశారు? విశాఖకు స్కాములు, అవినీతి, దోచుకునే కార్యక్రమం బహుమతులుగా ఇచ్చారు. ముఖ్యమంత్రి అంటే సాధారణంగా అంతా భయపడుతుంటారు.. అన్యాయం చేయకూడదనుకుంటారు.

 

చంద్రబాబే మాఫియాలా...

కానీ, కాపాడాల్సిన చంద్రబాబే ఒక మాఫియాగా తయారై దోచుకుని తింటుంటే అధికారులేం చేస్తారు? పొరుగు దేశంలో ఉన్నవాళ్లు మన భూములు లాక్కుంటే కాపాడుకునే యత్నం చేసేట్లుగానే మన భూములు లాక్కుంటున్న ఈ ప్రభుత్వాన్ని బంగాళఖాతంలోకలిపేయాలి. ఒక భరోసా ఇస్తున్నా. ఒక్క అంగుళం కూడా పోకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీకు అండగా పోరాడుతుంది. మనం ఎంత పోరాటం చేసినా విజయం రాకుంటే బాధపడొద్దు.. ఏడాదిన్నర తర్వాత మన పాలనే వస్తుంది. ప్రతి అంగుళం తిరిగి ప్రతి పేదవాడికి ఇస్తాను. ఇప్పుడు అన్యాయాలు చేస్తున్న వారందని అప్పుడు జైలులో వేస్తాం’  అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

 

మరిన్ని వార్తలు...


‘ఎవరినీ వదలిపెట్టం, అందరి భరతం పడతాం’



‘విశాఖను భూకబ్జాల హబ్‌గా మార్చారు’


(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top